ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే.. రెండో మ్యాచ్లో గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ను 63 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ను సీఎస్కే బౌలర్లు బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. శుభ్మన్ గిల్ (8) తొలి వికెట్గా వెనుదిరిగినప్పటి నుంచీ ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా (21), సాయి సుదర్శన్ (37) కాసేపు నిలబడ్డా.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన గుజరాత్ బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం పాతిక రన్స్ కొట్టలేకపోయారు.
విజయ్ శంకర్ (12), డేవిడ్ మిల్లర్ (21), రాహుల్ తెవాటియా (6), రషీద్ ఖాన్ (1) విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకు పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, తుషార్ దేశ్పాండే 2, డేరిల్ మిచెల్ 1, మతీశా పతిరానా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సీఎస్కే.. టోర్నీలో వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. 6 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. శివమ్ దూబే (51), రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) రన్స్ చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్స్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-03-26T18:32:30Z dg43tfdfdgfd