బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్లు

  • విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అరెస్ట్‌

కొండాపూర్‌, ఏప్రిల్‌ 19 : క్రికెట్‌ ప్రేమికుల అభిమానాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లు అమ్ముతున ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్‌కు చెందిన మధుబాబు(30), సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీకి చెందిన మాథ్యూ రోడ్రిక్స్‌(25), కొండాపూర్‌ అంజయ్యనగర్‌ వాసి నిజంతన్‌ ఎలంగోవన్‌ (26) ముగ్గురు కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు.

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, బెంగుళూరు మధ్య ఈ నెల 25న జరగబోయే మ్యాచ్‌ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న పక్కా సమాచారంతో మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 15 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు, ఒక్కో టికెట్‌ను రూ.10వేల నుంచి 15వేల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

2024-04-19T19:47:20Z dg43tfdfdgfd