ఐపీఎల్‌లో బ్యాటర్ల దండయాత్ర.. బంతిని మార్చాలంటున్న మాజీలు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రికార్డులు సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. దీంతో మ్యాచుల్లో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్‌కు పసైందన విందును అందిస్తోంది. అయితే ఈ స్థాయిలో భారీగా పరుగులు రావడం నేది బంతికి బ్యాటుకు మధ్య పోరును తగ్గిస్తోందని, బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్‌లో ఎప్పుడైనా.. బంతికి బ్యాట్‌కు సమానమైన పోరు జరిగితేనే అసలైన మజా వస్తుంది. భారీ స్కోర్లు చేయడం కంటే కూడా స్వల్ప స్కోరును డిఫెండ్ చేసుకోవడం అనేదే.. ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మారిన నిబంధనలు, పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పవర్ ప్లేలు, ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనలు బౌలర్ల పాలిట శాపంగా మారాయి. దీంతో ఈ సీజన్‌లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

ఐపీఎల్ చరిత్రలో 13 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న ఆర్సీబీ అత్యధిక స్కోరు (263) ఈ సీజన్‌లోనే రెండు సార్లు బ్రేక్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబైపై 277, ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. ఈ మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లోనూ ముంబై, ఆర్సీబీ జట్లు విజయం కోసం గట్టిగా పోరాడాయి. దీంతో ఈ స్థాయిలో స్కోరు చేసినా.. గెలుస్తామనే ధీమా లేకుండా పోయింది. ఇది చూస్తేనే అర్థం అవుతోంది కదా ఈ సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్‌లో ఉందనేది. ఈ సీజన్‌లో భారీగా పరుగులు వస్తున్న నేపథ్యంలో బౌలర్లకు ఊతం ఇచ్చేలా కొత్త ప్రతిపాదన ఒకటి తెరమీదకు వచ్చింది. "బంతిని మార్చాలి" అనే డిమాండ్ వినిపిస్తోంది.

మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల‌ మధ్య ముగిసిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ టీమ్.. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేకేఆర్ మెంటార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఒక బంతి 50 ఓవర్లు కూడా మనుగడ సాగించకుంటే దాని తయారీదారుడిని మార్చడంలో తప్పేముంది. ‘కూకబురా’ను అంత బలవంతంగా వాడే అవసరం ఏముంది? ఇంగ్లాండ్ టెస్టులలో ఉపయోగించే డ్యూక్ బంతిని ఐపీఎల్‌లోనూ వినియోగించాలి" అని ప్రతిపాదించాడు. కొత్త చర్చకు తెరలేపాడు.

భారీ స్కోర్లు నమోదవుతుండటంపై ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ఐపీఎల్‌ కూకబురాతో కాకుండా డ్యూక్‌ బాల్‌తో ఆడాలని సూచించాడు. తద్వారా బ్యాట్‌-బాల్‌ మధ్య సమానమైన పోటీ ఉంటుందని పేర్కొన్నాడు.

సాధారణంగా ఐపీఎల్‌లో కూకబురా బంతినే ఉపయోగిస్తారు. భారత పిచ్‌లపై ఈ బంతి నుంచి స్వింగ్‌, సీమ్‌ను రాబట్టడం బౌలర్లకు అంత ఈజీ కాదు. కుకబురాతో పోలిస్తే డ్యూక్‌ బాల్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో బంతికి, బ్యాటుకు మధ్య సమరం రసవత్తరంగా సాగుతుందని విశ్లేషకలు వాదిస్తున్నారు. మరి ఈ ప్రతిపాదనను బీసీసీఐ ఏ మేరకు స్వీకరిస్తుంది? బంతిని మారుస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T03:47:42Z dg43tfdfdgfd