ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్ ముంగిట ధోనీ.. జస్ట్ ఒక మ్యాచ్ దూరం

ఐపీఎల్‌ (IPL)లో అరుదైన రికార్డ్‌కి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్ 2023 ఫైనల్‌కి చేరుకోగా.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ధోనీ కూడా ఓ రికార్డ్‌ని నెలకొల్పబోతున్నాడు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఆడుతున్న ధోనీ.. ఇప్పటి వరకు 249 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో ఆదివారం జరగబోయే ఫైనల్ వ్యక్తిగతంగా ధోనీకి 250వ మ్యాచ్‌కాగా.. ఐపీఎల్ 16 ఏళ్ల చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన మొదటి క్రికెటర్‌గా రికార్డ్‌ని అందుకోనున్నాడు. ఈ రికార్డ్‌లో ధోనీ తర్వాత రోహిత్ శర్మ (243 మ్యాచ్‌లు), దినేశ్ కార్తీక్ (242), విరాట్ కోహ్లీ (237), రవీంద్ర జడేజా (225) వరుసగా టాప్-5లో కొనసాగుతున్నారు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. 2010, 2011, 2018, 2021లో ధోనీ కెప్టెన్సీలోనే టోర్నీ విజేతగా చెన్నై నిలవగా.. ఐదో టైటిల్‌పై కూడా ఆదివారం కన్నేసింది. ఇప్పటి వరకు ముంబయి మాత్రమే ఐదుసార్లు టైటిల్ గెలిచింది. అది కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే. ఒకవేళ ఆదివారం చెన్నై గెలిస్తే? రోహిత్ శర్మ సరసన ధోనీ కూడా నిలవనున్నాడు. ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2లో ఓడిపోయిన ముంబయి ఇండియన్స్ శుక్రవారం టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

2023-05-27T14:46:38Z dg43tfdfdgfd