T20 WORLD CUP 2024: కోహ్లీ విషయంలో అదే చేయాలి.. ద్రవిడ్‌కు లారా సూచనలు

ఓ పక్క ఐపీఎల్ 2024 జరుగుతుండగానే.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన సందడి మొదలైంది. చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సైతం 15 మందితో కూడిన ప్రధాన జట్టు.. నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ప్రపంచకప్ 2023ని కొద్దిలో మిస్ చేసుకున్న భారత్.. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసమే సీనియర్లు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఓ సూచన చేశాడు. అందుకు గల కారణాలను సైతం వెల్లడించాడు.

లారా ఏం చెప్పాడంటే..

"జట్టులు చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పుడు ప్రణాళికలు రచించుకోవడం అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. వాళ్లు ఉన్నారుగా.. వాళ్లే చూసుకుంటారులే అని భావిస్తాం. కొన్ని సార్లు మేనేజ్‌మెంట్ అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తాయి. కానీ.. టీమ్‌లో వివ్ రిచర్డ్స్ లేదా విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వాళ్ల నుంచి జట్టు ఏం ఆశిస్తుందో క్లియర్‌గా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితే గతంలో చాలా జట్లకు ఎదురైంది. 1987 వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు ఇదే ఎదురైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది"

"టీమ్‌లో గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించడంలో తప్పులేదు. కానీ వారితో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఉన్నందున సరైన ప్రణాళికతో సిద్ధమవ్వాలి. ఇదే నేను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఇచ్చే సూచన. విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ప్రస్తుతం ఉన్న టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం అతడి దురదృష్టం. అయినా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన రోహిత్ సారథ్యంలో భారత జట్టుకు ట్రోఫీని గెలిచే సత్తా ఉంది. నా వరకు మాత్రం.. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్-వెస్టిండీస్ తలపడాలని కోరుకుంటున్నా" అని బ్రియాన్ లారా తన మనసులోని మాటను చెప్పాడు.

కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో జూన్ 1న టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. భారత్ తన తొలి మ్యాచులో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌

రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T08:55:25Z dg43tfdfdgfd