Srilanka Cricket : శ్రీలంక పురుషుల జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు పేసర్లు అనారోగ్యంతో భారత జట్టుతో టీ20 సిరీస్ (T20 Series)కు దూరంకాగా.. తాజాగా మరో బౌలర్ జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. టీమిండియాతో శనివారం జరుగబోయే తొలి టీ20కి ముందు యువ పేసర్ బినుర ఫెర్నాండో (Binura Fernando) హాస్పిటల్లో చేరాడు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా బినుర ఇబ్బందిపడ్డాడు. దాంతో, లంక క్రికెట్ వైద్య బృందం అతడిని పరీక్షించి దవాఖానలో చేర్పించారు. దాంతో, ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు మొదలయ్యాయి.
సొంతగడ్డపై పొట్టి సిరీస్లో బోణీ కొట్టాలనుకున్న లంకకు పేసర్ల కొరత ఏర్పడింది. భారత జట్టుతో సిరీస్కు ఎంపికైన పేసర్ దుష్మంత చమీర(Dushmantha Chameera) ఊపిరితిత్తుల సమస్యతో టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకే యార్కర్ కింగ్ నువాన్ తుషార(Nuwan Tushara) సైతం గాయపడ్డాడు. చేతివేలికి గాయం కావడంతో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు.
ఈ ఇద్దరి గైర్హాజరీలో బౌలింగ్ భారం మోస్తాడనుకున్న బినుర కూడా ఇన్ఫెక్షన్తో ఆస్పత్రి పాలయ్యాడు. దాంతో, భారత జట్టుతో పల్లెకెలె స్టేడియంలో జూలై 27వ రాత్రి 730 గంటలకు జరుగనున్న తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. ఏకంగా ముగ్గరు పేసర్లు అందుబాటులో లేకపోవడంతో తుది జట్టులో ఎవరిని ఆడించాలి? అని లంక సారథి చరిత అసలంక, హెడ్కోచ్ సనత్ జయసూర్యలు మల్లగుల్లాలు పడుతున్నారు.