ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రికార్డు స్కోరు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల స్కోరు చేసినప్పటికీ.. సన్రైజర్స్ జట్టుకు విజయం అంత ఈజీగా ఏం దక్కలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే చెలరేగడంతో మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసింది. కానీ చివర్లో పుంజుకున్న సన్రైజర్స్ బౌలర్లు ముంబైను 246/5 పరుగులకు కట్టడి చేశారు. దీంతో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. ఆది నుంచే బాదుడు మొదలెట్టింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు రాగా.. రెండో ఓవర్ నుంచి అసలు కథ మొదలైంది. ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సహా 23 పరుగులు వచ్చాయి. దీంతో మూడు ఓవర్లు ముగేసి సరికే ముంబై స్కోరు 50 పరుగుల మార్కును చేరింది.
ఆ తర్వాతి ఓవర్లో షాబాజ్ అహ్మద్.. ఇషాన్ కిషన్ను ఔట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ముంబై బ్యాటర్లు మాత్రం హిట్టింగ్ ఆపలేదు. దీంతో 8 ఓవర్లకే జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. ఓ దశలో 11 ఓవర్లకే 150 మార్కు దాటడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై 165/3తో నిలిచింది. చివరి 48 బంతుల్లో ఆ జట్టు విజయానికి 113 పరుగులు అవసరం. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండటం, టిమ్ డేవిడ్ ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంటడంతో ముంబై శిబిరంలో విజయంపై ఆశలు చిగురించాయి.
కానీ 13వ ఓవర్ నుంచి సన్రైజర్స్ బౌలర్లు ఫామ్లోకి వచ్చారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ.. పరుగులు నియంత్రించారు. దీంతో ఆశించినంత వేగంగా ముంబై పరుగులు రాబట్టలేకపోయింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 246/5 పరుగులకు ఆ జట్టు పరిమితమైంది.
ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ 12 బంతుల్లో 26, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 34, నమన్ ధీర్ 14 బంతుల్లో 30, తిలక్ వర్మ 34 బంతుల్లో 64, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 42 రన్స్ స్కోర్ చేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 277/3 పరుగులు చేసింది. ఇప్పటిదాకా లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరుగా 263/5 ఉంది. 2013లో పూణె వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఫీట్ సాధించింది. 11 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఎస్ఆర్హెచ్ బద్దలు కొట్టింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే 80 రన్స్ స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ టోర్నీలో బోణీ కొట్టింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-03-27T18:04:45Z dg43tfdfdgfd