న్యూఢిల్లీ: భారత పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను క్రికెటర్ హర్భజన్ తప్పుపట్టాడు. దీంతో కమ్రాన్ అక్మల్(Kamran Akmal) దిగివచ్చాడు. సారీ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఏఆర్వై న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య రసవత్తర మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. చివరి ఓవర్లో పాక్ 18 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవర్ను హర్షదీప్ వేశాడు. దాని గురించి అక్మల్ కామెంట్ చేశాడు. ఏదైనా జరగవచ్చు అని, ఎందుకంటే టైం అర్థరాత్రి 12 దాటిందని అక్మల్ పేర్కొన్నాడు. సర్దార్లపై ఉన్న జోక్ను అతను పేల్చాడు.
అక్మల్ వ్యాఖ్యలను క్రికెటర్ హర్భజన్ తీవ్రంగా తప్పుపట్టాడు. అనుచితంగా మాట్లాడటానికి ముందు, సిక్కుల చరిత్ర తెలుసుకోవాలని, ఆక్రమణదారులు మీ తల్లులను, సోదరిలను ఎత్తుకెళ్తుంటే సిక్కులే కాపాడినట్లు భజ్జీ తెలిపాడు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని, సిక్కులపై కృతజ్ఞత ఉండాలని హర్భజన్ తెలిపాడు.
ఈ నేపథ్యంలో అక్మల్ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఇటీవల చేసిన కామెంట్ల పట్ల తీవ్ర పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. హర్భజన్ సింగ్తో పాటు సిక్కు వర్గానికి క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. తన వ్యాఖ్యలు వక్రంగా ఉన్నాయని, అమర్యాదపూర్వకంగా ఉన్నట్లు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల అమితమైన గౌరవం ఉందని, ఎవర్నీ క్షోభ పెట్టడం తన ఉద్దేశం కాదు అని, దీనికి తాను నిజమైన క్షమాపణలు చెబుతున్నట్ఉల అక్మల్ తెలిపాడు.