IPL 2024 : ఐపీఎల్ సీజన్ ఏదైనా కొందరు స్టార్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. ప్రతి ఎడిషన్లోనూ తమ మార్క్ ఇన్నింగ్స్లతో ఫ్యాన్స్ను అలరిస్తూనే ఉంటారు. అలాంటి దిగ్గజ ఆటగాళ్లలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఒకరు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాడిలా చెలరేగుతున్నధోనీ స్టేడియాల్లో సౌండ్ పెంచేస్తున్నాడు. మహీ భాయ్ బ్యాటింగ్కు వస్తుంటే.. ‘ధోనీ.. ధోనీ’ అంటూ పెద్ద పెట్టున అరుస్తున్నారు. దాంతో, స్టేడియాల్లో రోజురోజుకు శబ్ద తీవ్రత అమాంతం పెరిగిపోతోంది.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో మ్యాచ్లోనూ మహీ మైదానంలోకి వెళ్తుండగా.. అందరూ ధోనీ ధోనీ అంటూ నినదించారు. అంతే.. 95కి చేరింది. ఎక్నా స్టేడియంలో మ్యాచ్ చూసిన లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton Dekock) భార్య సాశా తన స్మార్ట్ వాచ్లో సౌండ్ను రికార్డు చేసింది.
ఆ రికార్డ్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో పెద్ద శబ్దం. డెసిబెల్స్ 95కు చేరింది. ఇలాగే 10 నిమిషాలు ఉంటే కొద్దిసేపు వినికిడి శక్తి కోల్పోవడం ఖాయం అని సాశా తన పోస్ట్లో రాసుకొచ్చింది. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు కట్టబెట్టిన ధోనీ ఆడుతున్నది సీఏస్కేకు అయినా.. అతడు ఎక్కడకు వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇక సొంత స్టేడియం చెపాక్లో అయితే ధోనీ ఎంట్రీ వేళ శబ్ద తీవ్రత ఏకంగా 130 డెసిబెల్స్కు చేరింది.
కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడుతున్న ధోనీ.. ఓ రేంజ్లో విజృంభిస్తున్నాడు. డెత్ ఓవర్లలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్పై ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ధోనీ.. లక్నోపైనా దంచాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మహీ విధ్వంసంతో చెన్నై 176 రన్స్ కొట్టినా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(82), ఓపెనర్ క్వింటన్ డికాక్(54)లు అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు. దాంతో, లక్నో8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది.