IND VS PAK: తక్కువ స్కోరైనా తగ్గేదేలే.. పాకిస్థాన్‌ను మరోసారి మట్టికరిపించిన భారత్‌

India Vs Pakistan Match Highlights: టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. అనంతరం పాకిస్థాన్‌ను 113/7 కు కట్టడి చేసింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించగా.. పాకిస్థాన్ రెండో ఓటమిని చవిచూసింది.

120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆచీతూచి బ్యాటింగ్ చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నిదానంగా బ్యాటింగ్‌ చేసేందుకే ఆ జట్టు ఓపెనర్లు మొగ్గు చూపారు. దీంతో 6 రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసే సరికి పాక్‌.. 57/1తో నిలిచింది. చేయాల్సిన స్కోరు తక్కువే ఉండటం 9 వికెట్లు చేతిలో ఉండటంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. కానీ కట్టుదిట్టంగా బంతులేసిన భారత పేసర్లు పాక్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్..113/7 కు పరిమితమైంది. మహమ్మద్‌ రిజ్వాన్‌ 44 బంతుల్లో 31 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

బూమ్రా నాలుగు ఓవర్లు వేసి.. కేవలం 14 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు తీసి పాకిస్థాన్ ఓటమిని శాసించాడు. హార్దిక్ పాండ్యా సైతం నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి.. 2 వికెట్లు తీశాడు. ఇక అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే.. మహ్మద్ సిరాజ్ వికెట్లు తీయకపోయినా.. 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చి పాక్‌ను కట్టడి చేయటంలో సఫలమయ్యాడు. జడేజా కూడా రెండు ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయినా.. బంతితో పాక్‌ను చుట్టేయటంలో భారత్ ప్రతిభ కనబరిచింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. స్వల్ప స్కోరుకే పరిమితమైంది. పాకిస్థాన్‌ బౌలర్ల ధాటికి చివరి 7 వికెట్లను 30 పరుగుల వ్యవధిలోనే కోల్పోయి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓ దశలో 11.1 ఓవర్లలో 89/3తో నిలిచిన భారత్.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్‌ (7), శివమ్ దూబె (3), హార్దిక్ పాండ్యా (7), రవీంద్ర జడేజా (0) విఫలం కావడంతో కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. భారత బ్యాటర్లలో రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 42 రన్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్‌ పటేల్‌ (20), రోహిత్ శర్మ (13) మినహా మరే బ్యాటర్‌ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా 3, హరీస్‌ రవూఫ్‌ 3, మహమ్మద్ అమీర్‌ 2, షాహీన్‌ అఫ్రిదీ 1 వికెట్‌ తీశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-09T20:26:06Z dg43tfdfdgfd