IND vs PAK : బంతి బంతికి ఉత్కంఠ.. వికెట్ పడితే చాలు ప్రపంచాన్ని గెలిచేశామన్న రేంజ్లో బౌలర్ల సంబురాలు. మ్యాచ్ ఆసాంతం భావోద్వేగాలు.. ఉరిమిఉరిమి చూసుకొనే ఆటగాళ్లు.. ఇక కసికొద్దీ బ్యాటర్లు ఫోర్, సిక్సర్ బాదారనుకో స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. ఇక ఎవరైనా హాఫ్ సెంచరీ కొట్టేశారంటే ఇక ఆ జట్టు డగౌట్లో జోష్ చూడాలసిందే. స్టాండ్స్లోని ప్రతి ఒక్కరూ మునివేళ్లపై నిలబడి చూసే మ్యాచ్కు అంతా సిద్దమైంది.
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా(India), పాక్(Pakistan) మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతున్నా.. ప్రపంచమంతా టీవీలముందు కళ్లార్పకుండా చూసేందుకు కాచుకొని ఉన్నారు. ఇక పాకిస్థాన్లో అయితే.. పెద్ద తెరలే పెట్టేశారు. రావల్పిండి స్టేడియంలో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసి.. పెద్ద తెర మీద లైవ్ మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్న భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించనున్నాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాక్పై టీమిండియాదే ఆధిపత్యం. రెండు టీమ్లు ఏడు పర్యాయాలు ఎదురుపడగా.. ఆరుసార్లు భారత్ దాయాదిని ఓడించింది. మెగా టోర్నీల్లో 6-1తో గొప్ప రికార్డు కలిగిన భారత జట్టు న్యూయార్క్లోనూ జయభేరి మోగించాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్లో ఐర్లాండ్ను ఓడించిన రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం విజయోత్సాహంతో ఉంది. మరోవైపు బాబర్ ఆజాం(Babar Azam) సేన ఆతిథ్య అమెరికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్ ఓవర్లో 5 పరుగుల తేడాతో ఓడి విమర్శలకు గురైంది.