Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ (Pakistan) వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మెగా టోర్నీ షురూ కానుంది. మార్చి 9వ తేదీన విజేత ఎవరో తేలిపోనుంది. ఆతిథ్య పాక్ జట్టు ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్ ఇప్పటికే వేదికలను ఖరారు చేసింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు నిర్వహించనున్నామని పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించిన విషయం తెలిసిందే.
ఐసీసీ చివరిసారిగా 2017లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టీమిండియాను ఓడించిన పాక్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. దాంతో, 2025 టోర్నీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే.. దాయాది గడ్డపై భారత జట్టు(Team India) ఆడుతుందా? లేదా? అని యావత్ క్రీడాలోకమంతా ఆసక్తిగా ఉంది.
ఎందుకంటే.. నిరుడు ఆసియా కప్(Asia Cup 2023) సమయంలోనే భద్రతా కారణాలతో పాక్లో ఆడమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. దాంతో, మరోదారి లేక హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో టోర్నీని నిర్వహించారు. అయితే.. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టు ఆడింది.
దాంతో, ‘మేము మా జట్టును పంపాం. కాబట్టి ఈసారి బీసీసీఐ కూడా తమ జట్టును మా దేశానికి పంపాలి’ అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ ఖాన్(Mohsin Khan) ఇప్పటికే డిమాండ్ చేశాడు. కానీ, ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం ఇంకా స్పందించలేదు.