Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్గా వైదొలిగిన బాబర్ ఆజాం(Babar Azam) మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. టీ 20 వరల్డ్ కప్ సమీపిస్తున్నందున మళ్లీ అతడినే సారథిగా ప్రకటించే చాన్స్ ఉంది. ఎందుకంటే.. షాన్ మసూద్, షాహీన్ ఆఫ్రిదీలు కెప్టెన్లుగా విఫలమయ్యారు. వెస్టిండీస్, అమెరికాలో జరిగే మెగా టోర్నీలో జట్టును నడిపించే సమర్ధుడైన నాయకుడు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించిన బాబర్కే మళ్లీ పగ్గాలు అప్పగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
‘మసూద్, ఆఫ్రిదిల సత్తాపై కొత్త చైర్మన్కు నమ్మకం లేదు. వీళ్లిద్దరూ టెస్టు, టీ20 జట్లను సమర్థంగా నడిపించలేరు. దాంతో, అనుభవజ్ఞుడైన బాబర్ను మళ్లీ కెప్టెన్గా ఎంపిచేసే అవకాశముంది’ అని పీసీబీ అధికారులు చెప్తున్నారు. పాక్ సారథిగా 2020లో పగ్గాలు చేపట్టిన బాబర్ జట్టుపై తన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్లో పాక్ను ఫైనల్కు తీసుకెళ్లాడు.
షాహీన్ ఆఫ్రిదీ, షాన్ మసూద్
అయితే.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టు వైఫల్యంతో బాబర్పై తీవ్ర స్థాయిలో వివర్శలు వచ్చాయి. దాంతో, ఓటమికి బాధ్యత వహిస్తూ బాబర్ రాజీనామా చేశాడు. ఏకంగా అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడు. అనంతరం టెస్టు కెప్టెన్సీ చేపట్టిన షాన్ మసూద్ ఆస్ట్రేలియాలో ఓటమి చవి చూశాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL)లో లాహోర్ క్యాలండర్స్ను రెండుసార్లు విజేతగా నిలిపిన ఆఫ్రిది.. టీ20 సారథిగా నిరూపించుకోలేకపోయాడు. అతడి సారథ్యంలో పాక్ న్యూజిలాండ్పై సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డుకు బాబర్ ఆజాం పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు.