ముంబై క్రికెట్‌ చీఫ్‌ మృతి

  • గుండెపోటుతో హఠన్మారణం

ముంబై: ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్‌ కాలె సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఆదివారం న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా అమోల్‌.. ఎంసీఏ ప్రతినిధులతో కలిసి భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వీక్షించి హోటల్‌కు వెళ్లాక గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. 47 ఏండ్ల అమోల్‌.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడు.

2022లో ఎంసీఏ ఎన్నికలలో భారత మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ను ఓడించి ఆ పగ్గాలు అందుకున్నాడు. ఎంసీఏ అధ్యక్ష హోదాలో అమోల్‌ పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చాడు. రానున్న దేశవాళీ సీజన్‌లో రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడే ప్లేయర్లందరికీ బీసీసీఐ నుంచి మ్యాచ్‌ ఫీజు దక్కేలా చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు. అమోల్‌ ఆకస్మిక మరణం పట్ల భారత మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు.

2024-06-10T19:23:53Z dg43tfdfdgfd