బంగ్లాదేశ్ కొంపముంచిన అంపైర్ నిర్ణయం.. అదే జరిగితే నాగిని డ్యాన్స్ చూసేవాళ్లం..!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా టోర్నీలో సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ప్రతీ పరుగు కీలమైందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా.. అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అంపైర్ నిర్ణయం, డెడ్ బాల్ రూల్ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే డెడ్ బాల్ రూల్ కారణంగా ఆ జట్టు 4 పరుగులు కోల్పోయింది. ఇదే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది.

అసలేం జరిగిందంటే..

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 114 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. చివరి వరకూ పోరాడింది. ఓ దశలో 16 ఓవర్లు ముగిసే సరికి 87/4తో నిలిచిన బంగ్లా గెలిచేలా కనిపించింది. ఈ దశలో జట్టు విజయానికి 24 బంతుల్లో 27 రన్స్ అవసరం. అయితే బార్ట్‌మన్ వేసిన 17 ఓవర్‌ రెండో బంతి బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్లా ప్యాడుకు తగిలి ఫోర్ వెళ్లింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో అంపైర్‌.. మహ్మదుల్లాను ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ సవాల్ చేసింది.

రివ్యూలో నాటౌట్ అని తేలింది. అయితే బంతి బౌండరీ లైన్‌ను దాటడంతో ఫోర్ ఇవ్వాలి కదా అనే ప్రశ్న తలెత్తింది. కానీ డెడ్‌బాల్ రూల్ ప్రకారం అలా ఇవ్వడం కుదరదని అంపైర్లు తేల్చేశారు. ఫలితంగా మహ్మదుల్లా తన వికెట్ కాపాడుకున్నా.. ఆ పోయిన పరుగులు మాత్రం సంపాదించలేకపోయాడు.

డెడ్‌బాల్ రూల్ ఏం చెబుతోంది?

ఈ రూల్ ప్రకారం.. క్రీజులోని బ్యాటర్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినప్పుడు ఎలాంటి అదనపు పరుగులు (లెగ్ బైస్, బైస్) ఇవ్వకూడదు. మహ్మదుల్లా విషయంలోనూ అంపైర్లు ఇదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకవేళ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించి, రివ్యూలోనూ అది నాటౌట్‌గా తేలితే మాత్రం ఆ రన్స్ ఇస్తారు. ఏది ఏమైనా డెడ్ బాల్ రూల్‌తో లెగ్‌బై రూపంలో రావాల్సిన 4 పరుగులను బంగ్లాదేశ్ కోల్పోయింది. చివరకు 4 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోవడంతో.. ఆ జట్టు ఫ్యాన్స్‌ ఈ రూల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిబంధనను భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లు తప్పుబట్టారు. ప్రత్యర్థికి కీలకమైన పరుగులు ఇవ్వకుండా చేయడానికి ఈ నిబంధనను ఒక టీమ్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వసీం జాఫర్ కూడా ఈ నిబంధనను తప్పుబడుతూ.. బంగ్లాదేశ్ టీమ్, అభిమానులకు తన సానుభూతి తెలిపాడు.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 రన్స్ చేసింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసి నాలుగు పరుగులతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ 2024లో వరుసగా మూడు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా టోర్నీలో సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-11T05:46:06Z dg43tfdfdgfd