బెస్ట్ ఫీల్డర్‌గా పంత్‌.. ఆ విషయాన్ని తలుచుకుని రవిశాస్త్రి భావోద్వేగం (వీడియో)

టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి సూపర్‌-8కు చేరువైంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 42 పరుగులు చేసిన రిషభ్‌ పంత్‌.. టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా వికెట్‌ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రమాణాలను పాటించిన పంత్.. బెస్ట్ ఫీల్డర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిన ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్‌ చేసిన ఒక ప్లేయర్‌కు టీమిండియా అవార్డు ఇస్తున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డర్‌గా నిలిచిన పంత్‌కు భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను అందించాడు. దీన్ని ఏ ప్లేయర్‌ సొంతం చేసుకున్నాడనేది ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ వెల్లడించిన అనంతరం.. రవిశాస్త్రి మెడల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు పట్టిన సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌తో పోటీ పడ్డ పంత్.. చివరగా అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పంత్‌కు మెడల్‌ను అందజేస్తూ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“నేను ఇప్పుడు మాట్లాడేముందు రిషభ్‌ పంత్‌ను హగ్‌ చేసుకుంటా. అతడిని టీ20 ప్రపంచకప్‌ 2024లో చూడటం సంతోషంగా ఉంది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే విషయం తెలియగానే.. నాకు కన్నీళ్లు వచ్చాయి. అతడిని ఆ పరిస్థితుల్లో ఆసుపత్రి బెడ్‌పై చూస్తాననుకోలేదు. కోలుకుని వచ్చి మరీ ఇలాంటి భారీ మ్యాచుల్లో సత్తా చాటడం ప్రశంసనీయం. అందుకే అభినందనలు చెబుతున్నా” అని రవిశాస్త్రి అన్నాడు.

“రిషభ్‌ పంత్ బ్యాటింగ్‌ గురించి అందరికీ తెలుసు. కానీ, వికెట్‌ కీపింగ్‌ చేయడం చాలా కష్టం. అంతటి రోడ్డు ప్రమాదం తర్వాత శస్త్రచికిత్సలు చేయించుకుని కోలుకుని.. మైదానంలో చురుగ్గా కదలడం మామూలు విషయం కాదు. పంత్‌ నువ్వు అంతర్జాతీయంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచావు. మృత్యువు అంచుల్లోకి వెళ్లి వచ్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నావ్. మున్ముందు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా” అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

కాగా, డిసెంబరు 2022లో రిషభ్‌ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద తీవ్రతకు కారులో మంటలు సైతం చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌.. వేగంగా కోలుకున్నాడు. 453 రోజుల తర్వాత ఐపీఎల్‌ 2024 ద్వారా పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. సాధారణంగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే పంత్.. ఈ టోర్నీలో మాత్రం వన్‌డౌన్‌లో వస్తూ రాణిస్తున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T17:44:17Z dg43tfdfdgfd