న్యూయార్క్‌ పిచ్‌పై అనూహ్య బౌన్స్‌.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ..!

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024కే హైలైట్‌గా నిలిచే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. న్యూయార్క్‌ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. అమెరికాలో క్రికెట్‌ విస్తరణ కోసం కృషి చేస్తున్న ఐసీసీ.. ఈ మ్యాచ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అంతర్జాతయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కి అనధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో న్యూయార్క్‌ పిచ్‌ స్పందిస్తున్న తీరును అందులో వివరించినట్లు సమాచారం. పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతుండటంతో బ్యాటర్లు గాయాలపాలయ్యే అవకాశం ఉందని... బీసీసీఐ నుంచే అనధికారికంగా కంప్లైట్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌-భారత్‌ మధ్య మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అంతేకాకుండా నెట్స్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా కూడా రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీకి ఇబ్బంది పడ్డట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీసు సందర్భంగా రోహిత్‌ శర్మ బొటనవేలికి గాయం అయినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కానీ గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో హిట్‌మ్యాన్‌ మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడట.

ఈ టోర్నీలో ఇప్పటివరకు (జూన్‌ 7) న్యూయార్క్‌ వేదికగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేవలం రెండు సార్లు మాత్రమే వందకు పైగా స్కోరు నమోదైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్‌ కాగా.. 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌లోనూ వందలోపే స్కోర్లు నమోదయ్యాయి. ఐర్లాండ్‌ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 12.2 ఓవర్లలో ఛేజ్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో కెనడా 137 పరుగులు చేయగా.. ఐర్లాండ్‌ 125కే పరిమితమైంది.

టీ20 క్రికెట్‌ అంటేనే బ్యాటర్ల దూకుడు ఉంటుందని ఫ్యాన్స్‌ ఆశిస్తారు. కానీ న్యూయార్క్‌ పిచ్‌ మాత్రం పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంటోంది. అమెరికాలో క్రికెట్ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తక్కువ స్కోర్లు నమోదైతే మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకుల ఆసక్తి చూపరని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదివారం జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఈ పిచ్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి..!

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-08T14:51:19Z dg43tfdfdgfd