వీనులవిందుగా IPL ముగింపు వేడుకలు.. భారీగా ఏర్పాట్లు చేసిన BCCI, ఆడిపాడేది వీరే

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌ వేసవిలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి బంతికి ఫలితాలు, బ్యాటర్ల విన్యాసాలు, బౌలర్ల సూపర్ స్పెల్‌లతో పాటు మైదానంలో గొడవలు, సోషల్ మీడియాలో పోస్టులతోనూ ఈ ఏడాది ఈ టోర్నీ అభిమానులను మరింత రంజింపజేసింది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీ ఇక ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే.. ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మే 28 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచు జరుగనుంది.

చెన్నై, గుజరాత్ మధ్య పోరుతో ప్రారంభమైన ఈ సీజన్.. ఆ రెండు జట్ల మధ్య పోరాటంతోనే ముగియనుండటం మరో విశేషం. ఆరంభ వేడుకలను అదిరిపోయేలా నిర్వహించిన బీసీసీఐ.. ముగింపు వేడుకలకు సైతం భారీగా ఏర్పాట్లు చేసింది.

గతేడాది ఇదే స్టేడియంలో (అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానం) ఐపీఎల్-15 ఫైనల్ జరిగింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తుది పోరు జరిగింది. ఈ వేడుకల్లో ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ స్టేడియంలోని ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఈ ఏడాది కూడా ముగింపు వేడుకలు వారిని రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఐపీఎల్-16వ సీజన్‌ ప్రారంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, రష్మిక మందనా ప్రేక్షకులను అలరించారు. ప్రారంభ వేడుకలను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు కోటీ మంది హాజరయ్యారు. టీవీలు, ఫోన్లలోనూ ఈ వేడుకలను కోట్లాది మంది వీక్షించారు. ఐపీఎల్ ముగింపు వేడుకలకు ఇంతకంటే ఎక్కువగా ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలను రప్పిస్తోంది బీసీసీఐ.

ప్రముఖ ర్యాపర్స్ కింగ్ వివియన్ డివిన్, న్యుక్లెయ (ఉదయన్ సాగర్), కింగ్‌ (అర్పన్ కుమార్ చండెల్)తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జొనితా గాంధీ అభిమానులను అలరించనున్నారు.

‘గల్లీ ర్యాప్’ ద్వారా గుర్తింపు పొందిన ముంబయికి చెందిన డివిన్.. 2013 లో ‘యె మేరా ముంబై పాట ద్వారా వెలుగులోకి వచ్చాడు. రణ్‌వీర్ సింగ్ నటించిన గల్లీ బాయ్ సినిమాలో ‘అప్నా టైమ్ ఆయేగా’ పాటతో పేరు సంపాదించాడు.

అహ్మదాబాద్‌కు చెందిన న్యుక్లెయ ర్యాపర్‌గా కేరీర్ ఆరంభించాడు. తర్వాత కపూర్ అండ్ సన్స్, హైజాక్, చోక్డ్ వంటి సినిమాలకు స్వరాలు సమకూర్చాడు. యూపీకి చెందిన కింగ్.. బొంబాస్, సర్కమ్‌స్టాన్సెస్, జిందా లాంటి ఆల్బమ్‌లతో పేరు గడించాడు.

జొనితా గాంధీ తెలుగు, తమిళ్, హిందీలో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. హలమిత్తి హబీబో (బీస్ట్), జిమికీ పొన్ను (వారసుడు), దేవా దేవా (బ్రహ్మస్త్ర) లాంటి పాటలతో అలరించారు.

సాధారణంగా ముగింపు వేడుకలు మ్యాచు ప్రారంభానికి ముందే జరుగుతాయి. కానీ, ఈసారి మ్యాచు ప్రారంభానికి ముందు కొన్ని, తొలి ఇన్నింగ్స్ తర్వాత మరికొన్ని ప్రదర్శనలు ఉండనున్నాయి. తొలుత డివిన్, న్యుక్లెయర్‌ల ప్రదర్శన ఉండనుండగా.. కింగ్, జొనితా గాంధీలు ఒక ఇన్నింగ్స్ తర్వాత అలరించనున్నారు. దీంతో పాటు కనులు మిరమిట్లు గొలిపే లైటింగ్ షోను కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ వినోదాలను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమయ్యారా మరి..?!

2023-05-27T07:46:31Z dg43tfdfdgfd