బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం.. పర్పుల్ క్యాప్ రేసులో 1, 2, 3 స్థానాల్లో హార్దిక్ టీం బౌలర్లే..

క్రికెట్, ఫుట్ బాల్‌, రగ్బీ, హాకీ ఆట ఏదైనా ఆడేది మాత్రం విజయం కోసమే. అయితే ఆ గెలుపు కొన్ని జట్లకు నల్లేరుపై నడకలా ఉంటే.. మరికొన్నింటికి మాత్రం అంత ఈజీ కాదు. మనం పైన చెప్పుకున్న ఆటలన్నీ.. టీం గేమ్‌లు. ఒక్కరు ఇద్దరు ఆడితే సరిపోదు.. సమష్టిగా ఆడాలి. టీం అనేది కేవలం ఒకరు ఇద్దరిపై ఎక్కువగా ఆధారపడితే కొన్ని మ్యాచులు గెలవొచ్చు. కానీ అంతిమంగా ట్రోఫీ గెలవాలంటే మాత్రం కష్టం. టీంలోని అందరి భాగస్వామ్యం ఉంటే అది సాధ్యం.

ఒకరిద్దరు ఆడితే జట్టు విజేతగా నిలవడం కష్టం అవుతుంది. ఇదివరకే ఈ తరహా ఘటనలు ఎన్నో ఉదాహారణలు చూశాం. జట్టు ఒకరిద్దరిపై ఆధారపడితే.. కీలక మ్యాచుల్లో వారు విఫలమైనప్పుడు టీం ఓడిపోవడం ఖాయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లోనూ ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. అంతే కాకుండా సమష్టిగా ఆడితే విజేతగా నిలవడం అంత కష్టమేమీ కాదని కూడా ప్రూవ్ అయింది. సమష్టిగా విజయాలకు నిదర్శనంగా నిలుస్తోంది గుజరాత్ టైటాన్స్ జట్టు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గతేడాది అడుగుపెట్టిన హార్ధిక్ టీం.. తొలి ఏడాది కప్పును ముద్దాడింది. ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు నిరీక్షిస్తున్నాయి. కానీ గుజరాత్ టైటాన్స్ మాత్రం వచ్చిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి ఆశ్చర్యపరిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తోంది. అందుకు ప్రధాన కారణం జట్టు బౌలింగ్ యూనిట్. సాధారణంగా టీంలోని ఎవరో ఒక బౌలర్ జట్టు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడు. కానీ గుజరాత్‌లో మాత్రం దళంలోని ప్రతీ సభ్యుడు తనదైన సమయంలో నాయకుడిగా మారిపోతున్నాడు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును పోటీలోకి తెస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్‌ రేసులో గుజరాత్ టైటాన్స్ టీం బౌలర్లే ముందంజలో ఉన్నారు. 1, 2, 3 స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు.

మహమ్మద్ షమీ 16 మ్యాచుల్లో 28 వికెట్ల తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న రషీద్ ఖాన్ తీసిన వికెట్లు 27. మరో బౌలర్ మోహిత్ శర్మ 13 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ గణాంకాలు చూస్తే చాలు.. బౌలింగ్‌లో గుజరాత్ టీం ఆధిపత్యం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతుంది. పరుగుల వేటలో శుభ్‌మన్ గిల్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. బౌలింగ్‌ యూనిట్‌ను ఈ త్రయం (షమీ, రషీద్, మోహిత్ శర్మ) ముందుండి నడిపిస్తోంది.

ఆటగాళ్లంతా కీలక సమయాల్లో తలా ఓ చేయి వేస్తుండటం, తమ వంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తుండటంతో గుజరాత్.. వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ చేరింది. మరి తుదిపోరులోనూ ఇదే జోరు కొనసాగిస్తే లీగ్‌లో రెండో టైటిల్ కొట్టడం హార్ధిక్ టీంకు పెద్ద కష్టమేమి కాదు.

2023-05-27T05:16:28Z dg43tfdfdgfd