Team India | పుణె : సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారినా పుణెలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టీమ్ఇండియా 15 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ లక్ష్యానికి చేరువగా వచ్చినప్పటికీ 19.4 ఓవర్లలో 166కే పరిమితమైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (19 బంతుల్లో 39, 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్ రాణా (3/33), స్పిన్నర్ రవి బిష్ణోయ్ (3/28) అద్భుత బౌలింగ్తో భారత్ను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. టాపార్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబె (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (30) రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
12/3.. రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరిది! ఈ స్థితి నుంచి భారత్ 181/9తో ముగించిందంటే అది హార్దిక్, దూబె పోరాటమే. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన పేసర్ సకీబ్ మహ్ముద్.. తాను వేసిన మొదటి ఓవర్లో శాంసన్ (1), తిలక్ (0), సూర్య (0)ను పెవిలియన్కు చేర్చడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ అభిషేక్ (19 బంతుల్లో 29, 4 ఫోర్లు, 1 సిక్స్) రింకూ నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. రెండు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్, దూబె ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ జోడీ ఆరో వికెట్కు 45 బంతుల్లోనే 87 పరుగులు జోడించడంతో భారత్ పోరాడగలిగే స్కోరును ప్రత్యర్థి ముందు నిలపగలిగింది.
భారీ ఛేదనను ఇంగ్లండ్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), డకెట్ బౌండరీల వర్షం కురిపించడంతో తొలి పవర్ ప్లే 5 ఓవర్లకే ఇంగ్లండ్.. 53 పరుగులు చేసింది. కానీ బిష్ణోయ్ 6వ ఓవర్లో డకెట్.. సూర్య చేతికి చిక్కగా ఆ మరుసటి ఓవర్లోనే సాల్ట్ను అక్షర్ క్లీన్బౌల్డ్ చేశాడు. బిష్ణోయ్ తన తరువాతి ఓవర్లో ప్రమాదకర బట్లర్ (2)నూ ఔట్ చేశాడు. దూబె స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా.. తన తొలి ఓవర్లోనే లివింగ్స్టన్ (9)నూ పెవిలియన్కు పంపి ఇంగ్లండ్కు షాకిచ్చాడు. హర్షిత్ వేసిన 14వ ఓవర్లో 6, 6, 4తో 25 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన బ్రూక్ను వరుణ్ బోల్తా కొట్టించడంతో ఇంగ్లండ్ గాడి తప్పింది. అదే ఓవర్లో వరుణ్.. కార్స్నూ వెనక్కి పంపాడు. ఆఖర్లో ఓవర్టన్ (19) భయపెట్టినా రాణా అతడి ఆట కట్టించడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
17 టీ20 ఫార్మాట్లో 2019 నుంచి స్వదేశంలో భారత్కు ఇది వరుసగా 17వ ద్వైపాక్షిక సిరీస్ విజయం
భారత్ : 20 ఓవర్లలో 181/9 (హార్దిక్ 53, శివమ్ 53, సకిబ్ 3/35, ఓవర్టన్ 2/32);
ఇంగ్లండ్ : 19.4 ఓవర్లలో 166 (బ్రూక్ 51, డకెట్ 39, రవి 3/28, రాణా 3/33)
2025-01-31T23:25:50Z