ROHIT SHARMA : వైజాగ్ వన్డే ముంగిట టీమిండియాకి బూస్ట్.. హిట్‌మ్యాన్ వచ్చేస్తున్నాడు!

IND vs AUS 2nd ODI : ఆస్ట్రేలియాతో రెండో వన్డే ముంగిట భారత్ జట్టుకి ఉత్సాహానిచ్చే వార్త. ఫ్యామిలీ రీజన్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేకి దూరంగా ఉండిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) .. రెండో వన్డేలో ఆడబోతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 1: 30 గంటలకి ప్రారంభంకానున్న ఈ రెండో వన్డేకి విశాఖపట్నం (Visakhapatnam) ఆతిథ్యం ఇవ్వబోతుండగా ఈరోజే భారత్ జట్టుతో హిట్‌మ్యాన్ చేరనున్నాడు. రోహిత్ శర్మ భార్య సోదరుడి వివాహం కారణంగా తొలి వన్డేకి రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు.

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కానీ.. మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రస్టింగ్‌గా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఛేదనలో భారత్ జట్టు కూడా 39/4తో నిలిచి అభిమానుల్ని కంగారు పెట్టింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (75 నాటౌట్) చాలా రోజుల తర్వాత గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. అలానే రవీంద్ర జడేజా (45 నాటౌట్) మరోసారి బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. దాంతో 39.5 ఓవర్లలో 191/5తో భారత్ గెలిచింది.

తొలి వన్డేలో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ ఆడారు. కానీ.. ఇషాన్ 3 పరుగుల వద్దే ఔటైపోగా శుభమన్ గిల్ 20 పరుగులే చేశాడు. అలానే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య టీమ్‌ని నడిపించాడు. ఇక వైజాగ్ వన్డేలో భారత్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల్ని మళ్లీ రోహిత్ శర్మ అందుకోనుండగా ఓపెనర్లలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. గిల్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఇషాన్ కిషన్‌‌ని పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-18T10:15:12Z dg43tfdfdgfd