PBKS vs MI match News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఈనెల 11న జరగాల్సి ఉన్న ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వేదిక మారింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 11న ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ఎయిర్పోర్ట్లను భారత ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఆటగాళ్లు ధర్మశాలకు వెళ్లడంపై ఇబ్బందులు తలెత్తాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా ధర్మశాల వేదికలోనే తలపడుతున్నాయి. అయితే ఎయిర్పోర్ట్లు మూసివేసే లోపే.. ఆ రెండు జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ నిర్వహించుకునేందుకు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడంతో ఇవాళ్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. కానీ మే 11న ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ను గుజరాత్లోని అహ్మదాబాద్కు తరలించారు. దీనిపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. ''పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్లో మార్పు జరిగింది. ఈ విషయంపై బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేం సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ తెలియజేశాం.'' అని ఆయన చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల క్రికెట్ స్టేడియం పంజాబ్ కింగ్స్కు సొంతమైదానం. ఇక్కడ ఐపీఎల్ 2025లో మూడు మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. మే 3న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను పంజాబ్ 37 పరుగుల తేడాతో ఓడించింది. వాస్తవానికి మే 11న జరగాల్సిన మ్యాచ్ను ముంబై వేదికగా నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అదే జరిగితే ముంబై ఇండియన్స్కు హోం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందనే ఉద్దేశంలో తటస్థ వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియానికి ముంబై జట్టు ఇవాళ చేరుకున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా అహ్మదాబాద్కు చేరుకుంటుంది.
2025-05-08T12:25:53Z