ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మరో 15 లీగ్ స్టేజ్ మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏడు జట్లు టాప్-4 ప్లేసు కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇందులో ముందంజలో ఉన్న నాలుగు జట్లలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 3, 4వ ప్లేసులో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.ఈ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్లలో ఏడింట్లో విజయం సాధించింది. గుజరాత్ 10 మ్యచ్లలోనే 7 విజయాలు కైవసం చేసుకుంది. అయితే నెట్రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న ముంబై మూడో ప్లేసులో ఉంది. ఆ జట్టు వరుసగా ఆరు విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లోకి దూసుకొచ్చింది. ఇవాళ్టి మ్యాచ్లో గెలిచిన జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరినట్లే! ఎందుకంటే ఇవాళ్టి విజయం ఆయా జట్లకు ఎనిమిదో విజయం అవుతుంది. ఆ తర్వాత నెట్రన్ రేట్ భారీగా కోల్పోకుండా ఓడిపోయినా.. ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.ఈ రెండు జట్లు మధ్య ఈ టోర్నీలో ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. అందులో గుజరాత్ టైటాన్స్.. 36 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. అయితే ఫామ్ ప్రకారం చూస్తే.. రెండు జట్లూ కూడా సమానంగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్, సూర్యకుమార్లు ఫామ్లో ఉన్నారు. అటు గుజరాత్ టైటాన్స్ త్రయం గిల్, సుదర్శన్, బట్లర్లు సైతం పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో ఇవాళ్టి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్లు జరగ్గా.. అందులో గుజరాత్ నాలుగు విజయాలు సాధించింది.గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైన ముంబై స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. డోప్ పరీక్షలో విఫలమైన స్వదేశానికి వెళ్లిపోయిన కగిసో రబాడ తిరిగి గుజరాత్ టైటాన్స్ శిబిరంలో చేరిపోయాడు! అతడు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.