Malaysia Masters : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత్కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం.
మహిళల సింగిల్స్లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. మరో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఫామ్లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్తో అతడు తలపడనున్నాడు. గత ఏడాది స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ప్రణయ్ ఈసారి విజేతగా నిలవాలనే కసితో ఉన్నాడు.