ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్.. వచ్చే సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల అతడి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా మరోసారి అతడి పేరు చర్చల్లోకి వచ్చింది. అయితే ఇది ఐపీఎల్కో.. ఇండియన్ క్రికెట్కో సంబంధించి కాదు. కేరళ క్రికెట్ లీగ్ రెండో సీజన్ కోసం తాజాగా వేలం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సంజూ శాంసన్ రికార్డు ధర పలికాడు.
* కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్.. ఎగిరిపడ్డ మిడ్ వికెట్!
కేరళ క్రికెట్ లీగ్ రెండో సీజన్కు ముందు జరుగుతున్న వేలంలో ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.50 లక్షలు పర్స్గా కేటాయించారు. ఆ డబ్బుతోనే ఫ్రాంఛైజీలు టీమ్ను సెట్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఎడిషన్ ద్వారా తొలిసారి వేలంలోకి వచ్చిన సంజూ శాంసన్ కోసం.. ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. మొత్తం పర్స్లో సగం కంటే ఎక్కువ వెచ్చించేందుకు సిద్ధమయ్యాయి. రూ.3 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన సంజూ.. ఏకంగా రూ.26.80 లక్షలు పలికాడు. అంటే ఫ్రాంఛైజీ పర్స్లో సగానికంటే ఎక్కువే. అతడిని కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు దక్కించుకుంది.
తొలుత సంజూ కోసం.. త్రిన్సూర్ టైటాన్స్ జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. ఏకంగా రూ.20 లక్షలు బిడ్ వేసింది. ఆ తర్వాత అనూహ్యంగా వేలంలోకి ప్రవేశించిన కొచ్చి బ్లూ టైగర్స్.. అతడిని సొంతం చేసుకునేంత వరకు ధర పెంచుతూ పోయింది. తిరువనంతపురంలో ఈ వేలం జరుగుతోంది. కాగా కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు కేవలం ఒక్క ఆటగాడి కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మిగిలిన రూ.23 లక్షల్లో టీమ్ను ఎలా తీసుకుంటారని పేర్కొంటున్నారు.
*ఇంగ్లండ్ ట్రాప్లో కరుణ్ నాయర్.. రెండో టెస్టులోనూ ఫెయిల్!
ఈ వేలంతో సంజూ శాంసన్.. కేరళ క్రికెట్ లీగ్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు విష్ణు వినోద్ పేరిట ఉండేది. గత వేలంలో అతడిని ఆరీస్ కొల్లం టీమ్ రూ.13.8 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే జలజ్ సక్సేనాను అలప్పీ రిపుల్స్ రూ.12.4 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది. కేరళ క్రికెట్ లీగ్ రెండో సీజన్.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది. భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సంజూ.. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఇప్పట్లో టీ20 మ్యాచ్లు లేకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి సంజూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
2025-07-05T12:07:49Z