IPL PLAYOFFS CHANCES: 4 బెర్తులు.. 15 మ్యాచులు.. 7 టీమ్లు.. రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేసు!
![]()
IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొత్తం 70 లీగ్ మ్యాచులలో ఇప్పటికే 55 పూర్తయ్యాయి. మరో 15 మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. మరో మూడు జట్లు మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రేసులో ఉన్న 7 జట్లేవి.. వాటి అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ప్రస్తుతం 16 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ టాపర్గా ఉంది. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. ఒక్క దాంట్లో గెలిచినా.. ప్లే ఆఫ్స్లోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. ఒకవేళ మూడింట్లో ఓడినా ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ అది ఇతర మ్యాచుల ఫలితాలపై ఆధారపడి ఉంది.
పంజాబ్ కింగ్స్..
11 మ్యాచులు ఆడి 15 పాయింట్లు సాధించిన పంజాబ్ కింగ్స్.. మిగిలిన మూడు మ్యాచులలో రెండింట్లో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆ జట్టు తన తర్వాతి మూడు మ్యాచులను ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.
ముంబై ఇండియన్స్..
వరుసగా ఆరు విజయాలతో టేబుల్లో టాప్-4లోకి దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్.. మిగిలిన మూడు మ్యాచులలో రెండింట్లో గెలిస్తే.. నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకోనుంది. ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక నెట్ రన్ రేట్ కలిగి ఉన్న జట్టు ముంబై ఇండియన్స్ (1.274). ఇది ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది.
గుజరాత్ టైటాన్స్..
గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచులలో ఏడింట్లో గెలిచి 14 పాయింట్లు కలిగి ఉంది. నెట్ రన్ రేట్ (0.867) విషయంలో ముంబై తర్వాతి స్థానంలో ఉంది. ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచులలో మూడింట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్..
సన్ రైజర్స్తో మ్యాచ్ రద్దవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఊపిరిపీల్చుకుంది. మ్యాచ్ ఆగిపోయే నాటికి సన్ రైజర్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా.. వర్షం కారణంగా ఇరు జట్లకూ చెరో పాయింట్ వచ్చింది. ప్రస్తుతం 11 మ్యాచులలో 13 పాయింట్లు కలిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. మగిలిన మూడు మ్యాచులలో గెలిస్తే.. ఇతర జట్లపై ఆధారంగా పడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది.
కోల్కతా నైట్ రైడర్స్ & లక్నో సూపర్ జెయింట్స్..
11 మ్యాచులాడి.. 11 పాయింటల్లు సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లక్నో పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. మిగిలిన మూడు మ్యాచులలో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ఈ జట్టు ముందంజ వేయొచ్చు.ప్రస్తుత పరిస్థితిలో 18 పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశముంది. అంతకంటే తక్కువ పాయింట్లతోనూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించొచ్చు. కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఇక సీఎస్కే, రాజస్థాన్, సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
2025-05-06T07:54:39Z