భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025 రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ దీటుగా బదులిస్తూ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ కూడా భారత్పై దాడికి యత్నించింది. పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలోని ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. దాంతో ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను అధికారులు అర్ధంతరంగా నిలిపివేశారు. ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ పది ఓవర్లు ముగిసే సమయానికి స్టేడియంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. తొలుత ఫ్లడ్ లైట్స్ సమస్య అనుకున్నప్పటికీ బ్లాక్ అవుట్ నేపథ్యంలో ఒక్కసారిగా స్టేడియంలోని ప్రేక్షకులను తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. గ్రౌండ్లోని ప్రేక్షకులు, అంపైర్లు కూడా లోపలికి వెళ్లారు. మ్యాచ్ని రద్దు చేసిన అధికారులు ఇరు జట్లకి చెరొక పాయింట్ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య హైటెన్షన్ నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఐపీఎల్ 2025ని అర్ధంతరంగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా తమ తమ దేశాలకు పంపించడమే ఇప్పుడు బీసీసీఐ ఫస్ట్ ప్రియారిటీ. యుద్ధం కారణం కాకుండా ఉంటే ఈ మ్యాచ్లను మరో దేశం వేదికగా నిర్వహించి ఉండేవాళ్లు.. కానీ, భారత్ - పాక్ మధ్య భారీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఐపీఎల్ను రద్దు చేసేలాగే కనిపిస్తున్నారు. ఐపీఎల్ 2025లో దాదాపు అన్ని జట్లు 11 మ్యాచ్లు ఆడగా.. ప్లే ఆఫ్స్కు దగ్గరవుతున్న నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు నెలకొనడం దురదృష్టమనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ ప్లేస్లో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏడో స్థానంలో కొనసాగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా మిగిలిన స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
2025-05-08T17:25:47Z