IND W VS ENG W: వరల్డ్ కప్ ట్రోఫీకి అడుగు దూరంలో అమ్మాయిలు.. ఇంగ్లాండ్‌తో కాసేపట్లో ఫైనల్

భారత క్రికెట్ అభిమానులకు ఇవాళ పండగ రోజు. టీమిండియా ఇవాళ రెండు మ్యాచ్‌ల్లో తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య లక్నో వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా.. అమ్మాయిల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.15 గంటలకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యా్చ్ ప్రారంభం కానుంది.

సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన షషాలీ సేన.. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. రెండో సెమీస్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.5 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియాను ఇంగ్లిష్ బౌలర్లు 18.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ చేశారు.

మరోవైపు న్యూజిలాండ్‌‌, భారత్ మధ్య తొలి సెమీస్ ఏకపక్షంగా సాగింది. భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్‌ 107 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శ్వేతా షెరావత్ అజేయ హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో ఒక్కసారి మాత్రమే ఇంగ్లిష్ బౌలర్లు 100కుపైగా పరుగులిచ్చారు. ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ 103 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లను భారత బ్యాటర్లు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారనే దాన్ని బట్టే ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న శ్వేతా షెరావత్, కెప్టెన్ షఫాలీ వర్మ ఫైనల్లో సత్తా చాటడం భారత్‌కు కీలకం. శ్వేత ఆరు మ్యా్చ్‌ల్లో 146 యావరేజ్‌తో 292 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ ఆరు మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రేస్ స్క్రీవెన్స్ 6 మ్యాచ్‌ల్లో 48.17 యావరేజ్‌తో 289 పరుగులతో టోర్నీ సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా ఉంది. ఫైనల్ మ్యాచ్ శ్వేత వర్సెస్ గ్రేస్‌గా ఉండనుంది. ఇంగ్లాండ్ బౌలర్ హన్నా బేకర్, భారత బౌలర్ పార్శవి చోప్రా 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో సమ ఉజ్జీలుగా కొనసాగుతున్నారు. గ్రేస్ స్క్రీవెన్స్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి 8 వికెట్లు తీయడం గమనార్హం.

శనివారం బర్త్ డే జరుపుకున్న టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ.. తన పుట్టిన రోజు కానుకగా.. వరల్డ్ కప్ ట్రోఫీని అందించాలని సహచరులను కోరింది. భారత అమ్మాయిలు ఫైనల్ చేరగానే.. బీసీసీఐ కార్యదర్శి జై షా వారితో మాట్లాడి అభినందనలు తెలిపారు. ఫైనల్‌కు ముందు వారిలో స్ఫూర్తి నింపారు.

2023-01-29T06:40:55Z dg43tfdfdgfd