IND VS PAK | నిమిషాల్లోనే ఉఫ్‌.. హాట్‌కేకుల్లా భారత్‌ VS పాక్‌ మ్యాచ్‌ టికెట్లు

IND vs PAK | దుబాయ్‌ : దాయాదుల క్రికెట్‌ సమరానికి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్‌ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో చూసి ఆనందించేవారి కోసం ఐసీసీ.. టికెట్లను ఆన్‌లైన్‌లో సోమవారం విక్రయానికి పెట్టింది. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈనెల 23న దుబాయ్‌ ఆతిథ్యమివ్వనున్న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఐసీసీ.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచిన టికెట్లు నిమిషాల్లోనే ముగిశాయి.

25వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ క్రికెట్‌ స్టేడియంలో టికెట్లను ఐసీసీ.. సోమవారం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా వాటికోసం అభిమానులు ఎగబడ్డారు. సుమారు ఒక లక్షా 50 వేల మంది ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం పోటీపడటంతో ఒక్కొక్కరి టికెట్‌ బుక్‌ అయ్యేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది.

2025-02-03T22:42:10Z