అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.

ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లాండ్ నిర్దేశించిన  స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేరుకుంది.

భారత్ ఓపెనర్లుగా దిగిన షెఫాలి వర్మ, శ్వేత సెహ్రావత్‌లు బ్యాటింగ్‌కి దిగిన కొద్ది సేపట్లోనే పెవిలియన్ బాట పట్టారు.

కానీ, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్య తివారి(24 పరుగులు నాటౌట్), గొంగడి త్రిష(24 పరుగులు) టీమ్‌పై పెద్దగా ఒత్తిడి పెట్టకుండానే జట్టును విజయ బాట పట్టించారు.

https://twitter.com/ICC/status/1619712637075607554

తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ షెఫాలి వర్మ 15 పరుగులు చేయగా, శ్వేత సెహ్రావత్ ఐదు పరుగులు చేశారు. ఇలా 20 పరుగులకు భారత్ రెండు వికెట్లను కోల్పోయింది.

కానీ, ఆ తర్వాత బ్యాటింగ్‌కి చేసిన సౌమ్య, త్రిషలు అలవోకగా ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఈ ఇద్దరూ కలిసి 46 పరుగులు చేశారు. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష 29 బంతుల్లో 24 పరుగులు చేసింది.

అయితే, మరో మూడు పరుగుల్లో భారత్ విజయం సాధిస్తుందన్న సమయంలో, త్రిష ఔటైంది.  

టాస్ గెలిచి, ఫీల్డింగ్‌కు దిగిన భారత్

ఫైనల్ మ్యాచ్‌లో భారత అండర్ 19 మహిళల టీమ్ కెప్టెన్ షెఫాలి వర్మ టాస్ గెలుచుకున్నారు. అయితే, టాస్ గెలుచుకున్న తర్వాత టీమ్ బ్యాటింగ్‌కి బదులు ఫీల్డింగ్ చేసేందుకే మొగ్గు చూపింది షెఫాలి వర్మ.

సౌత్ ఆఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రోమ్‌లో జరుగుతున్న ఈ తుది మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

భారత కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్‌పై బౌలర్లు విరుచుకుపడ్డారు.

ఇంగ్లాండ్ టీమ్‌కి చెందిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ కూడా వికెట్ పడకుండా నిలుపుకోలేకపోయారు.

17.1 ఓవర్లకే ఇంగ్లాండ్ టీమ్ మొత్తం కుప్పకూలింది. ఇంగ్లాండ్ టీమ్ ఈ ఓవర్లలో కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐదో బ్యాటర్‌గా వచ్చిన రియాన్ మెక్‌డొనాల్డ్ గే(19 పరుగులు), ఏడవ ప్లేయర్‌గా వచ్చిన ఎలెక్సా స్టోన్‌హౌస్(11 పరుగులు), 10వ ప్లేయర్‌గా వచ్చిన సోఫియా(11 పరుగులు), యెన్ హోల్యాండ్(10  పరుగులు)లు మాత్రమే రెండంకెలలో స్కోరును చేయగలిగారు.

ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఆ నలుగురు బ్యాటర్లు తప్ప, మరే ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా రెండంకెల్లో స్కోరును సంపాదించలేకపోయింది. కేవలం 39 పరుగులకే ఇంగ్లాండ్ టీమ్‌లోని ఐదుగురు ప్లేయర్లు పెవిలియన్‌కి బాట వెళ్లాల్సి వచ్చింది.

బౌలర్లు టీటాస్ సాధు, పార్శ్వి చోప్రా, అర్చనా దేవీలు చెరో రెండు వికెట్ల చొప్పున తీశారు.

సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై గెలిచి భారత్ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత మహిళల క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కూడా స్టేడియానికి వచ్చారు.

ప్లేయర్లకు నగదు బహుమతి

భారత జట్టు ప్రపంచ కప్ గెలుచుకోగానే, సోషల్ మీడియాలో టీమ్ సభ్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీసీఐ సెక్రటరీ జై షా మహిళల టీమ్‌కి రూ.5 కోట్ల నగదు బహుమానాన్ని ప్రకటించారు.

‘‘భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా మహిళా క్రికెట్‌ను ఎన్నో స్థానాల ఎత్తులో నిల్చోబెట్టింది. టీమ్ మొత్తానికి, స్టాఫ్‌కు మద్దతిచ్చేందుకు రూ.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది నిజంగా సరికొత్త ఏడాది’’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-01-29T15:47:00Z dg43tfdfdgfd