గిల్ అజేయ శతకం.. సత్తా చాటిన హార్దిక్.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద విజయం

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ అజేయ శతకం బాదడంతో టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య కెరీర్లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడంతోపాటు.. పేసర్లు విజృంభించడంతో కివీస్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో పరుగుల అంతరం పరంగా భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్.. 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ సొంత గడ్డ మీద రెండు టీ20, 2 వన్డే సిరీస్‌లు ఆడిన భారత్.. నాలుగింటినీ సొంతం చేసుకోవడం గమనార్హం.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ ఆరంభంలోనే ఇషాన్ కిషన్ (1) వికెట్‌ను కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ త్రిపాఠి ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. 4 ఫోర్లు, 3 సిక్సులు బాదిన త్రిపాఠి 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. త్రిపాఠి ఔటయ్యాక సూర్య (13 బంతుల్లో 24), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో 30) వేగంగా ఆడారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 12 ఫోర్లు, 7 సిక్సులతో 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

35 బంతుల్లో 50 రన్స్ చేసిన గిల్ ఆ తర్వాత జోరు పెంచాడు. ఫెర్గ్యుసన్ బౌలింగ్‌లో బౌండరీ బాది 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీనే గిల్ శతకంగా మలవడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఏడాది గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. శుభ్‌మన్ అజేయ శతకంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్ చెలరేగడంతో 2.4 ఓవర్లలోనే 7 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. బ్రాస్‌వెల్‌ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ 21 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో డారెల్ మిచెల్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. కెప్టెన్ శాంట్నర్ (13)తో కలిసి ఆరో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. మావి బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు యత్నించి శాంట్నర్.. సూర్య బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఇష్ సోధీ (0)ని మావి ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్య వరుస ఓవర్లలో ఫెర్గ్యుసన్, టిక్నర్‌‌లను పెవిలియన్ చేర్చగా.. మిచెల్ (25 బంతుల్లో 35)ను ఔట్ చేసిన ఉమ్రాన్ మాలిక్ లాంఛనాన్ని ముగించాడు. దీంతో న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటయ్యింది.

2023-02-01T16:57:25Z dg43tfdfdgfd