కివీస్‌తో తొలి టీ20కి ముందు.. భారత క్రికెటర్లను సర్‌ప్రైజ్ చేసిన ధోనీ

భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత ఊరైన రాంచీ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే రాంచీ చేరుకున్న భారత క్రికెటర్లు మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతున్నారు. కాగా హార్దిక్ పాండ్య నాయకత్వంలోని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురువారం స్టేడియంలో కలిశాడు. భారత క్రికెటర్లను మహీ కలిసిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన ధోనీ.. కొబ్బరి నీళ్లు తాగుతూ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్య, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుంద, చాహల్ తదితర క్రికెటర్లతో ముచ్చటించాడు. ఆటగాళ్లతోపాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఇతర సహాయక సిబ్బందిని సైతం ధోనీ కలిశాడు.

అంతకు ముందు టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య.. ధోనీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. రాంచీలోని ధోనీ ఇంటికి వెళ్లిన హార్దిక్.. ‘షోలే 2 త్వరలో వస్తోంది’ అనే క్యాప్షన్‌తో ధోనీతో కలిసి వింటేజ్ బైక్ మీద కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బైకులను అమితంగా ఇష్టపడే ధోనీ దగ్గర అరుదైన, ఖరీదైన బైకులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ కోసం సన్నద్ధం అవుతోన్న మహీ.. ఇటీవలే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

జార్ఖండ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

2023-01-26T14:24:09Z dg43tfdfdgfd