శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్.. 4వ టీ20లో ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తుది జట్టులో ఏకంగా 3 మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీల స్థానాల్లో రింకూ సింగ్, శివమ్ దూబె, అర్షదీప్ సింగ్‌లు జట్టులోకి వచ్చారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్‌ సాకిబ్ మహమూద్ ధాటికి భారత టాప్ ఆర్డర్ కకావికలం అయింది. మహమూబ్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ (0)లు విఫలమయ్యారు. దీంతో 12 పరుగులకే భారత్‌ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్ శర్మ (29), రింకూ సింగ్ (30) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించే సమయంలో వీరిద్దరూ ఔట్ అయ్యారు. దీంతో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో శివమ్ దూబె (53), హార్దిక్ పాండ్యా (53)లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 17.5 ఓవర్లలో 166/5తో నిలిచిన భారత్.. 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ సరిగ్గా ఈ సమయంలో దూబె, పాండ్యాలు ఔట్ కావడంతో భారత్ అనుకున్నాదని కంటే కాస్త తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివరకు భారత్‌ 9 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది.ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్‌ 3, జెమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కేర్స్ 1, ఆదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

2025-01-31T15:45:00Z