రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్‌ షాక్.. గాయంతో కెప్టెన్‌ శాంసన్ దూరం..!

ఐపీఎల్ 2025 వచ్చే నెలలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్చి 21న టోర్నీ కొత్త సీజన్ ప్రారంభమై.. మే 25న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించారు. దీంతో చాలా జట్లు.. తమ జట్లలో భారీ మార్పులు చేసుకున్నాయి. కప్పు కొట్టడమే లక్ష్యంగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే చాలా ఫ్రాంఛైజీలు.. శిబిరాలు కూడా ప్రారంభించేశాయి. అయితే ఈ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్‌షాక్ తగిలినట్లు తెలుస్తోంది.ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ.. సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి వచ్చి తాకడంతో అతడి చూపుడు వేలు విరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికి సంజు సిక్స్‌ కొట్టాడు. దాదాపు 150కి.మీ. వేగంతో వచ్చిన మూడో బంతి అతడి చేతి గ్లవ్‌కు తాకింది. దీంతో ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆ తర్వాత నొప్పితోనే.. మరో సిక్స్‌, ఫోర్‌ కొట్టి ఔట్‌ అయ్యాడు.అయితే ఔట్ అయిన తర్వాత సంజూ శాంసన్ డగౌట్‌లో కూర్చున్నాడు. ఈ సమయంలో చేతికి వాపు పెరగింది. అయితే స్కానింగ్‌లో వేలు ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. దీంతో సంజూ శాంసన్ ప్రస్తుతం కేరళ తిరువనంతపురంలోని తన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌కు వెళ్లనున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.“సంజూ శాంసన్ కుడి చేతి చూపుడు వేలికి ఫ్రాక్చర్ అయింది. అతడు మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించేందుకు 5-6 వారాలు పట్టొచ్చు. ఫిబ్రవరి 8 నుంచి పుణె వేదికగా జరగనున్న కేరళ, జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో అతడు ఆడట్లేదు. గాయం తీవ్రతను బట్టి చూస్తే శాంసన్‌ తిరిగి ఐపీఎల్‌ 2025 సీజన్‌తో పునరాగమనం చేసే అవకాశాలున్నాయి” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 51 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. ఇక ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌, తర్వాత జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి శాంసన్‌ ఎంపిక కాలేదు. అయితే ఐపీఎల్‌ మార్చి 21 నుంచి జరగనుంది. అప్పటివరకు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేడా అన్నది తేలాల్సి ఉంది.

2025-02-03T16:16:13Z