ముంబయి ఇండియన్స్‌కి ఓటమి రుచి చూపిన యూపీ వారియర్స్.. జైత్రయాత్రకి తెర

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్రకి యూపీ వారియర్స్ తెరదించింది. సీజన్‌ ఆరంభం నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబయి ఇండియన్స్ జట్టుని శనివారం 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ఓడించేసింది. ఆరో మ్యాచ్ ఆడిన యూపీ టీమ్‌కి ఇది మూడో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్‌కి తొలి ఓటమి ఇదే. అలానే డబ్ల్యూపీఎల్ 2023లో ముంబయికి ఓటమి రుచి చూపిన తొలి జట్టుగా యూపీ వారియర్స్ నిలిచింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో యూపీ వారియర్స్ టీమ్ విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో వాంగ్ చేతికి ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతినిచ్చింది. అయితే.. లాస్ట్ ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వాంగ్ విసరగా.. యూపీ వారియర్స్ టీమ్ బ్యాటర్ ఎక్లెస్టోన్ కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. దాంతో యూపీ టీమ్‌లో టెన్షన్ మొదలైంది. కానీ.. మూడో బంతిని ఫుల్ టాస్ రూపంలో విసరగా ఎక్లెస్టోన్ దొరికిందే ఛాన్స్ అన్నట్లు సిక్స్‌గా మలిచేసింది. దాంతో అప్పటి వరకు ముంబయి బౌలర్లు చేసిన పోరాటం వృథా అయిపోయింది.

అంతకముందు ముంబయి జట్టులో వాంగ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె 19 బంతుల్లో 4x4, 1x6 సాయంతో 32 పరుగులు చేసింది. సీజన్‌లో సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటైంది. అనంతరం ఛేదనలో యూపీ మిడిలార్డర్ బ్యాటర్లు మెక్‌గ్రాత్ 25 బంతుల్లో 38 పరుగులు, గ్రేస్ హారిస్ 28 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఆ జట్టు అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. ఈ ఇద్దరి ఔట్ తర్వాత మ్యాచ్‌లో అసలు మజా మొదలైంది. చివర్లో దీప్తి శర్మ (14 బంతుల్లో 13 పరుగులు ) వేగంగా పరుగులు రాబట్టలేకపోయినా ఎక్లెస్టోన్ సిక్స్ కొట్టడంతో యూపీ ఊపిరి పీల్చుకుంది.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-18T14:00:21Z dg43tfdfdgfd