మియాన్ మ్యాజిక్.. ఇంగ్లాండ్ 407 ఆలౌట్.. భారత్కు 180 రన్స్ లీడ్!
![]()
ఎడ్జ్ బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 84/5తో నిలిచిన ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఆ తర్వాత 387/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ చివరి ఐదు వికెట్లు 20 పరుగుల వ్యవధిలో కోల్పోయి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.
84/5తో పీకల్లోతు కష్టాల్లోకి..
ఓవర్నైట్ స్కోరు 77/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో జో రూట్, బెన్ స్టోక్స్ను ఔట్ చేశాడు. దీంతో 84/5తో నిలిచి.. ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందని అంతా భావించారు.
కట్ చేస్తే.. 303 రన్స్ భాగస్వామ్యం..
84/5తో నిలిచిన ఇంగ్లాండ్ను హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ ఆదుకున్నారు. 100లోపే ఐదు వికెట్లు కోల్పోయినా.. ఎటాకింగ్ గేమ్ ఆడారు. ముఖ్యంగా జెమీ స్మిత్.. టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. దీంతో చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం.. 100, 200, 300 పరుగుల మైలురాయిని దాటేసింది. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
బ్రేక్ త్రూ ఇచ్చిన ఆకాశ్ దీప్..
303 పరుగుల భాగస్వామ్యాన్ని ఆకాశ్ దీప్ విడదీశాడు. హ్యారీ బ్రూక్ (158) ను ఔట్ చేశాడు. దీంతో భారత్కు 387 పరుగుల వద్ద ఆరో వికెట్ దక్కింది. ఆ తర్వాత సిరాజ్ కూడా చేయి వేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. అంతకు ముందు టీమిండియా బౌలర్ ప్రసీద్ కృష్ణ టెస్ట్ క్రికెట్లో చెత్త రికార్డును నమోదుచేశాడు. ఇంగ్లాండ్ చివరి 5 వికెట్లను భారత బౌలర్లు 20 పరుగుల్లోనే కూల్చారు. దీంతో 407 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. జెమీ స్మిత్ 207 బంతుల్లో 184 రన్స్తో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు.. ఆకాశ్ దీప్ 4 వికెట్లు పడగొట్టారు.
2025-07-04T17:07:51Z