ఐపీఎల్ 2025లో వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకొస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ఫామ్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్ 2025లో మిగతా మ్యాచులకు దూరమయ్యాడని.. ఐపీఎల్ పాలకమండలి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ ప్రకటించింది. అతడి ప్లేసులో కర్ణాటకకు చెందిన సీనియర్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.కాగా ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన 11 మ్యాచులలో ఆ జట్టు ఎనిమిదింట్లో గెలిచింది. పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్లతో రెండో ప్లేసులో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా 8 విజయాలు సాధించినా..నెట్రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆ జట్టు తొలి స్థానంలో ఉంది. ఆర్సీబీ రెండో ప్లేసులో ఉంది. ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచులలో ఒక్క దాంట్లో గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరినట్లే.ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ పడిక్కల్ను రూ.2 కోట్లకు దక్కించుకుంది. గతంలోనూ ఆర్సీబీకి ఆడిన అనుభవమున్న ఈ ప్లేయర్.. ఈ సీజన్లో విశేషంగా రాణించాడు. ఆడిన 10 మ్యాచులలో 150కి పైగా స్ట్రైక్ రేటుతో 247 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. పడిక్కల్ స్థానంలో ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకుంది.కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్కు ఐపీఎల్లో అపార అనుభవముంది. అతడు 2011 నుంచి ఈ లీగ్లో ఆడుతూ.. 127 మ్యాచులలో 2661 పరుగులు స్కోరు చేశాడు. 2011లో ఆర్సీబీ తరఫున కూడా ఆడాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఈ టోర్నీ ద్వారా ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉన్న ఆర్సీబీకి.. మయాంక్ అగర్వాల్ ఏ మేరకు ఉపయోగపడతాడనేది తేలాల్సి ఉంది. ఆర్సీబీ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ ఆడనుంది.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హ్యారీ బ్రూక్ స్థానంలో అఫ్ఘానిస్థాన్కు చెందిన బ్యాటర్.. సెదిఖుల్లా అటల్ను జట్టులో తీసుకున్నట్లు ప్రకటించింది.
2025-05-08T02:55:33Z