త్రిష ఆల్‌రౌండర్ షో.. అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్.. ఫైనల్లో సఫారీలు చిత్తు

అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌ 2025 విజేతగా భారత్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా.. ఓటమి అనేది లేకుండా టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా ఏడో మ్యాచ్‌లో గెలిచి ఈ ఫీట్ సాధించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఛేదించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల దెబ్బకు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. పరునిక సిసోడియా 2, ఆయుషి శుక్లా 2, వైష్ణవి శర్మ 2, శబ్నమ్‌ షకీల్ 1 వికెట్ పడగొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలోనే విజయం సాధించింది. బౌలింగ్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి త్రిష బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 33 బంతుల్లో 44 రన్స్ చేసి.. నాటౌట్‌గా నిలిచింది. సానిక చల్కే 22 బంతుల్లో 26 రన్స్‌తో అజేయంగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో గెలిచింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. ఆ తర్వాత మలేషియా, శ్రీలంక జట్లను ఓడించి సూపర్‌ సిక్స్‌కు చేరింది. సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లను ఓడించింది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇక తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించింది.బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ తెలుగుమ్మాయే నిలిచింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ త్రిష అజేయ శతకం బాదడంతోపాటు 6 పరుగులకే 3 వికెట్లు తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే.కాగా పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లోనూ భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. ఇక మహిళల జట్టు కూడా అదే జట్టుపై విజయం సాధించింది.

2025-02-02T09:30:40Z