టీమిండియా టెస్టు కెప్టెన్ కావాలని ఉందా? జడ్డూ ఏం సమాధానమిచ్చాడంటే..!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. తొలి టెస్టులో మోస్తరు ప్రదర్శన చేసిన జట్టు.. రెండో టెస్టులో మాత్రం కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు 211/5తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు.. కెప్టెన్ గిల్‌తో కలిసి 200లకు పైగా భాగస్వామ్యాన్ని అందించాడు. ఆరో వికెట్‌కు 203 పరుగుల జోడించి.. టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో అతడు 137 బంతుల్లో 89 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.

ఇక తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మాట్లాడిన రవీంద్ర జడేజా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో టీమిండియా టెస్ట్‌ కెప్టెన్ కావాలని ఉందా? అనే ప్రశ్నకు సైతం సమాధానం ఇచ్చాడు. విలేకరుల నుంచి ఈ ప్రశ్న ఎదురుకాగా.. “అదేం లేదు. ఆ టైమ్ అయిపోయింది” అని రవీంద్ర జడేజా నవ్వుతూ అన్నాడు.

గిల్ సూపర్‌..

“శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేసినప్పుడు అతడి కాన్ఫిడెన్స్‌ స్థాయిని గమనించా. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఒక బ్యాటర్‌గానే ఉన్నాడు. సారథిగా అస్సలు కనిపించలేదు. గిల్‌ అదనపు బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్ అవుతాడని అనుకోలేదు.. కానీ దురదృష్టవశాత్తూ క్యాచ్‌ వెళ్లింది. భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై.. మే బ్యాటింగ్ చేస్తున్నంత సేపు చర్చించాం. కొత్త బంతితో కాసేపు జాగ్రత్తగా ఆడితే పరుగులు చేయొచ్చని అనుకున్నా. అదే చేశా” అని కెప్టెన్‌ గిల్‌ను ఉద్దేశించి రవీంద్ర జడేజా అన్నాడు. ఇక, ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ జట్టు తొలిరోజు భారీ స్కోర్ సాధించిన విషయం తెలిసిందే.

ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు..

“మనం ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడుతున్నప్పుడు ఆధిక్యంలో ఉన్నామని ఎప్పుడూ అనుకోకూడదు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచాలి. ఈ మ్యాచ్‌లో మేం అదే చేశాం,” అని జడ్డూ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో జట్టులో సీనియర్ ప్లేయర్‌ అయిన జడ్డూ.. ఓ ఆప్షన్‌గా కనబడ్డాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. 25 ఏళ్ల గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

2025-07-04T11:08:04Z