టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటన..!

Rohit Sharma Announces Retirement: టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న హిట్‌మ్యాన్‌ ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ మేరకు టెస్టుల్లో తన క్యాప్‌ ఫొటోతో పాటు.. తన మనసులోని మాటను ఆ ఫొటోపై రాసుకొచ్చాడు. తాను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించాడు. వన్డే క్రికెట్లో కొనసాగుతానని వెల్లడించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా కొనసాగనున్నాడు. “హలో ఎవిరీవన్‌. నేను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాననే విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా నాపై ప్రేమ చూపించి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. భారత్ తరఫున వన్డే క్రికెట్‌లో కొనసాగుతా,” అని రోహిత్ శర్మ రాసుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కేవలం వన్డేలు, టెస్టుల్లో మాత్రమే ఆడతానని వెల్లడించాడు. అయితే ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌, కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు తనంతట తానుగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్‌ 2025 తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడే టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ శర్మను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికచేయకపోవచ్చనే వార్తలు వచ్చాయి. దీనిపై సెలక్టర్లు సమాచారం ఇచ్చారో లేదో తెలీదు గానీ.. జట్టు ప్రకటన కంటే ముందు రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పుకొచ్చాడు.రోహిత్ శర్మ భారత్ తరఫున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 116 ఇన్నింగ్స్‌లలో 4302 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2025-05-07T14:40:22Z