టీమిండియాకు షాక్.. ఇంగ్లండ్ టూర్‌ అన్ని మ్యాచ్‌లకు బుమ్రా కష్టమే..? వైస్ కెప్టెన్ వేటలో బీసీసీఐ!

టీమిండియా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. జూన్‌లో జరిగే ఇంగ్లండ్ టూర్‌కు జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్ స్థానంలో ఎంపిక చేయడం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. దాంతో బుమ్రాను వైస్ కెప్టెన్‌గా తొలగించి అతని స్థానంలో ఓ యంగ్‌స్టర్‌ని తీసుకోవాలని బీసీసీఐ చూస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేని సమయంలో జస్ప్రిత్ బుమ్రా ఎన్నోసార్లు సారథ్య పగ్గాలు చేపట్టాడు. ముఖ్యంగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌తో పాటు ఆఖరి మ్యాచ్‌కు కూడా బుమ్రానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మొదటి టెస్టు విజయం సాధించగా, ఆఖరి టెస్టు మధ్యలోనే గాయం కారణంగా బుమ్రా వెళ్లిపోయాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. బ్యాక్ ఇంజ్యూరీ కారణంతో జస్ప్రిత్ బుమ్రా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టీమిండియాకు చాలా కాలమే దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉండలేకపోయాడు. ఐపీఎల్ సగం సీజన్ ముగిసన తర్వాత ముంబై ఇండియన్స్‌‌లో జాయిన్ అయ్యాడు. ఐపీఎల్‌ లాంటి టీ20 ఈవెంట్లలో రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో పూర్తి స్థాయిలో అంటే కష్టమే అని చెప్పొచ్చు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అయితే ఇంగ్లండ్ పిచ్‌లపై బుమ్రా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నా.. ఐదు టెస్టులు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఐదు టెస్టులలో మూడు మాత్రమే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఐదు టెస్టులు ఆడే యంగ్‌స్టర్‌ని తీసుకోవాలని చూస్తోందంట. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్ కానీ రిషబ్ పంత్‌ని కానీ తీసుకోవాలని బీసీసీఐ చూస్తోంది. శుభమన్ గిల్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా చేయడమే కాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇకపోతే రిషబ్ పంత్‌కు టీ20ల్లో ఇండియాను లీడ్ చేసిన అనుభవం ఉంది. మరి ఈ ఇద్దరిలో వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో వేచి చూడాలి.

2025-05-05T04:54:09Z