‘జై హింద్‌’.. ఆపరేషన్ సిందూర్‌పై క్రీడాలోకం స్పందన ఇదే..!

పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో మెరుపుదాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌పై క్రీడాలోకం స్పందించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలురురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత సైన్యాన్ని కొనియాడారు. ఈ ఘటనపై స్పందించిన సచిన్ టెండూల్కర్‌.. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటు లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. “ఐక్యతలో భయం ఉండదు. బలంలో అవధులు ఉండవు. ప్రజలే భారతదేశ కవచం. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి ఏమాత్రం కూడా చోటు లేదు. ఈ విషయంలో మనదంతా ఒకటే జట్టు.. జై హింద్‌” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, ప్రజ్ఞన్ ఓజా, ఆర్పీ సింగ్, వెంకటేశ్ ప్రసాద్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ధర్మో రక్షతి రక్షితహః.. జైహింద్ భారత సేన’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘ఎల్లవేళలా సైన్యానికి మద్దతుగా నిలుస్తాం.. జై హింద్‌’ అని ఇతర క్రికెటర్లు పేర్కొన్నారు. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, అమిత్‌ మిశ్రా వంటి మాజీలు కూడా ‘‘ఆపరేషన్ సిందూర్‌’’ అని భారత సైన్యానికి తమ మద్దతును ప్రకటించారు.అటు భారత క్రికెటర్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైతం ఆపరేషన్ సిందూర్ అంటూ మద్దతు తెలిపాడు. అటు ఇంగ్లాండ్ క్రికెటర్‌ సామ్ బిల్లింగ్స్ సైతం.. ఈ ఘటనపై స్పందించాడు. “భారత్, పాకిస్థాన్‌ మధ్య పరిస్థితులు త్వరగా చక్కబడాలి” అని కామెంట్ చేశాడు. కాగా జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. ఇందులో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత్ బదులు తీర్చుకోవాలని ప్రతి భారతీయుడూ బలంగా కోరుకున్నాడు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై బుధవారం తెల్లవారు జామున వైమానిక దాడి చేసింది. భారత వైమానిక దళం 23 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి.. వెనక్కి వచ్చింది.

2025-05-07T11:55:21Z