ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-8లో నిలిచిన 8 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దీని గురించి ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఈ జట్టు ఫైనల్ చేరుతుంది? ఈ జట్లు సెమీ ఫైనల్ చేరతాయి? అనే ప్రెడిక్షన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్లు చేరిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లాండ్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీ స్ చేరతాయని అంచనా వేశాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో తలపడ్డ భారత్-ఆస్ట్రేలియాలను దాటుకుని.. ఇతర జట్లు ఫైనల్ చేరడం కష్టమే అని అంచనా వేశాడు. పాకిస్థాన్ సెమీస్ చేరడం కష్టమే అని రవిశాస్త్రి అంచనా వేశాడు.రవిశాస్త్రి వ్యాఖ్యలతో రికీ పాంటింగ్ అంగీకరించాడు. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్ను తక్కువ అంచనా వేయొద్దని.. రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్ అని పాంటింగ్ అన్నాడు. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉందని కొనియాడాడు.