ఇటీవల టెస్టులో భారత్ పేలవ ప్రదర్శన చేస్తుండటంతో బీసీసీఐ.. ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు మళ్లీ రంజీల బాట పట్టారు. అయితే ఇక్కడ కూడా చాలా మంది ప్లేయర్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. తాజాగా విరాట్ కోహ్లీ సైతం 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడాడు. అందులోనూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు.అయితే స్టార్ ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ ఆడటంపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్కు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. అతడి టెక్నిక్లో ఎలాంటి లోపం లేదని.. కాస్త విరామం తర్వాత కోహ్లీ మళ్లీ ఫ్రెష్గా తిరిగొస్తాడని వ్యాఖ్యానించాడు.“ప్రస్తుతం విరాట్ కోహ్లీకి రంజీ ట్రోఫీలో మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. 81 సెంచరీలు చేసిన సమయంలో అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంది. దాన్నే కంటిన్యూ చేస్తే చాలు. ఎవ్వరూ అతడిపై ఒత్తిడి తీసుకురావొద్దు. విరాట్కు కాస్త సమయం కావాలి. అతడి లోపల పరుగులు చేయాలనే ఆకలి ఇంకా ఉంది. కోహ్లీపై నమ్మకం ఉంచి గౌరవించాలి. అతడిని ఒంటరిగా వదిలేయాలి” అని రాయుడు పేర్కొన్నాడు.కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసినా.. మిగతా మ్యాచ్లలో మాత్రం విఫలమయ్యారు. 5 టెస్టుల్లో కలిపి.. 23.75 సగటుతో 190 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు ఫామ్లోకి రావాలనే పట్టుదలతో రంజీ బాట పట్టాడు. కానీ రైల్వేస్తో మ్యాచ్లో ఆరు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక భారత్.. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది. దీంతో త్వరలో అతడు భారత జట్టుతో కలవనున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ షురూ కానుంది.
2025-02-01T16:30:25Z