టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టుల్లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని.. ఓ అనవసర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేట్ నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే వరస్ట్ ఎకానమీ కావడం గమనార్హం.
2023లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన అతడు.. వన్డే తరహాలో పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు.. 72 పరుగులు సమర్పించుకున్నాడు. 5.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. మొత్తంగా టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 618 బంతులేసిన ఈ పేసర్.. 529 పరుగులు సమర్పించుకున్నాడు. 5.17 ఎకానమీతో ఈ పరుగులు ఇచ్చాడు.
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులేసిన బౌలర్ నమోదు చేసిన వరస్ట్ ఎకానమీ ఇదే కావడం గమనార్హం. ఈ జాబితాలో భారత్కు చెందిన వరుణ్ అరోన్.. రెండో ప్లేసులో ఉన్నాడు. అతడు 1189 బంతులేసి 947 పరుగులు ఇచ్చాడు. మూడో స్థానంలో అప్ఘానిస్థాన్కు చెందిన జహీర్ ఖాన్ (900 బంతుల్లో 699 రన్స్), నాలుగో ప్లేసులో పాకిస్థాన్కు చెందిన ఆమర్ జమాల్ (893 బంతుల్లో 690 రన్స్), ఐదో ప్లేసులో బంగ్లాదేశ్కు చెందిన నహిద్ రాణా (1332 బంతుల్లో 1020 రన్స్) ఉన్నారు.
ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఒక ఓవర్లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్, ఒక వైడ్ ఉంది. అంతేకాకుండా ఒక స్పెల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గానూ ప్రసిద్ధ్ నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలి ఐదు ఓవర్లలో ఏకంగా 50 రన్స్ సమర్పించుకున్నాడు.
2025-07-04T16:37:50Z