ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ ఔట్.. ఢిల్లీ లక్కీ ఎస్కేప్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిష్క్రమించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేశాక మొదలైన వాన ఎంతకూ తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించారు.కాగా ఈ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్ అప్పగించి కేవలం 133/7 పరుగులకే పరిమితం చేసింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీసి.. ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచులో ఈజీగానే గెలిచేలా కనిపించింది. హిట్టర్లతో నిండిన హైదరాబాద్.. వీలైనంత త్వరగా మ్యాచును ముగించి.. కీలకమైన 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్‌ను భారీగా పెంచుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు.కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతకూ వర్షం తగ్గలేదు. దీంతో మ్యాచును రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం రాకపోవడం ఇది రెండోసారి. ఇదివరకే పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు అయింది. దీంతో రెండు జట్లకూ చెరో పాయింట్ కేటాయించారు.ఈ ఫలితంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 11మ్యాచులలో కేవలం మూడింట్లో మాత్రమే గెలిచిన ఆ జట్టు.. మిగతా మూడు మ్యాచులో గెలిచినా.. కేవలం 13 పాయింట్లు మాత్రమే అవుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు 14 పాయింట్లు సాధించడంతో సన్ రైజర్స్ పోరాటం ముగిసినట్లయింది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానానికి చేరింది.

2025-05-05T18:54:25Z