ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ చెత్త రికార్డ్.. ఏకంగా ఆరుగురు డకౌట్..!

ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 407 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే జెమీ స్మిత్, హ్యారీ బ్రూక్‌లు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలా మూడొందలకు పైగా భాగస్వామ్యం నమోదైన తర్వాత కూడా ఓ జట్టు 410లోపు ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి.

ఆరుగురు డకౌట్..

తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇందులో ఇద్దరు గోల్డెన్ డక్ అవ్వగా.. మరో ఇద్దరు రెండో బంతికి ఔట్ అయ్యారు. ఒకరు నాలుగో బంతి, ఇంకొకరు తాము ఎదుర్కొన్న ఆరో బంతికి పెవిలియన్ చేరారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన బ్యాటర్లు వీరే..

బెన్ డకెట్ (5 బంతుల్లో)

ఓలీ పోప్ (1 బంతుల్లో)

బెన్ స్టోక్స్ (1 బంతుల్లో)

బ్రైడన్ కేర్స్ (4 బంతుల్లో)

జోష్ టంగ్ (2 బంతుల్లో)

షోయబ్ బషీర్ (2 బంతుల్లో)

ఇలా 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకుమందు నాలుగు సార్లు ఐదుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

ఇదే సమయంలో ఇంగ్లాండ్ మరో చెత్త రికార్డును సైతం నమోదు చేసింది. ఓ ఇన్నింగ్స్‌లో 300లకు పైగా భాగస్వామ్యం నమోదయినప్పటికీ అత్యల్ప స్కోరు 407కే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (158), జెమీ స్మిత్ (184)తో ఆరో వికెట్‌కు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిగతా బ్యాటర్లలో జాక్ క్రాలీ (19), జో రూట్ (22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. క్రిస్ వోక్స్ ఐదు పరుగులు చేసి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 587 రన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో 180 పరుగుల ఆధిక్యం లభించింది.

2025-07-05T02:07:50Z