ఒక్క ఛాన్స్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ వరుసగా రెండో టెస్టులోనూ ఫెయిలయ్యాడు. 2017లో ట్రిపుల్ సెంచరీ తర్వాత టీమిండియాలో అవకాశాలు కోల్పోయిన కరుణ్.. 2025 ఇంగ్లండ్ సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి టెస్టులో విఫలమైన నాయర్.. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులోనూ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్ల ట్రాప్లో చిక్కుకుని వికెట్ కోల్పోయాడు.
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 64/1 పరుగుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు రెండో వికెట్ను త్వరగా కోల్పోయింది. స్వింగ్ బౌలింగ్ ప్రయోగాలు చేసిన ఇంగ్లండ్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. కరుణ్ నాయర్ను టార్గెట్ చేసుకుని బౌన్సర్లు, ఆఫ్ వికెట్ అవతలగా బంతులు వేస్తూ ముప్పుతిప్పలు పెట్టింది. స్లిప్లో ఒకట్రెండ్ అవకాశాలు వచ్చినా ఫీల్డర్లు లేకపోవడంతో టీమిండియా సేఫ్ అయింది.
మొదటి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ను అవుట్ చేసిన బ్రైడన్ కార్సే రెండో ఇన్నింగ్స్లోనూ కరుణ్ వికెట్ తీశాడు. మొదటి ఇన్నింగ్స్లో 31 పరుగులు చేసిన కరుణ్, రెండో ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసి కీపర్ క్యాచ్గా అవుటయింది. దాంతో టీమిండియా 96 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్కు కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు మొదటి సెషన్ డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 46, శుభమన్ గిల్ 7 పరుగులతో క్రీజులో కొనసాగుతుండగా.. రెండో ఇన్నింగ్స్లో 289 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభమన్ గిల్ 269 పరుగులతో రాణించడంతో రికార్డు స్థాయిలో 587 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కూడా మొదటి ఇన్నింగ్స్లో దీటుగానే సమాధానం ఇచ్చింది. జెమీ స్మిత్, హ్యారీ బ్రూక్ సెంచరీలు చేయడంతో 407 పరుగులు చేసింది. దాంతో భారత్కు మొదటి ఇన్నింగ్స్లో 180 పరుగుల పరుగుల ఆధిక్యం వచ్చింది.
2025-07-05T11:37:51Z