అదరగొట్టిన టీమ్‌ఇండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం

ఇంగ్లాండ్‌పై టీమిండియా అదరగొట్టింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే, టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. 3-1తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒక దశలో ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆదుకున్నారు. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశారు. సిరీస్‌లో భాగంగా నామమాత్రపు ఐదో టీ20 మ్యాచ్‌.. ముంబై వేదికగా ఆదివారం జరగనుంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. సిరీస్‌లో తొలిసారి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ (0)లు స్వల్ప స్కోరుకే ఔట్ కావడంతో భారత్‌ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె (53), హార్దిక్ పాండ్యా (53)లు సత్తా చాటారు. వీరిద్దరూ కలిసి వందకు పైగా భాగస్వామ్యం నిలపడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (29), రింకూ సింగ్ (30) కూడా ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అత్యధికంగా సాకిబ్ మహమూద్‌ 3 వికెట్లు తీశాడు. జెమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కేర్స్ 1, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు.అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు సత్తా చాటడంతో 5.5 ఓవర్లలో 62/0తో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఈజీగా గెలిచేలా కనిపించింది. ఈ దశలో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. శివమ్ దూబె కంకషన్‌కు గురికావడంతో ఫీల్డ్‌లోకి వచ్చిన హర్షిత్ రాణా సైతం మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తన టీ20 కెరీర్‌లో రెండో బంతికే వికెట్ తీశాడు.మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ఇంగ్లాండ్ ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. దీంతో సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. చివరకు 19.4 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 166 రన్స్‌కి ఆలౌట్ అయింది. భారత్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌ మొత్తం ఐదు మ్యాచ్‌లది కాగా.. చివరి టీ20 పుణె వేదికగా ఆదివారం జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది.

2025-01-31T17:30:03Z