MOHAMMED SIRAJ | బెంగళూరును వీడిన మహ్మద్‌ సిరాజ్‌.. భావోద్వేగానికి గురైన హైదరాబాదీ బౌలర్‌..!

Mohammed Siraj | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం సోమవారంతో ముగిసింది. చాలా వరకు జట్లు కొత్త వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలో పాత వారిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. హైదరాబాదీ స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. రైట్‌ టు మ్యాచ్‌ (RTM)ని సైతం ఉపయోగించుకునేందుకు ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఈ దాంతో ఏడేళ్ల అనంతరం మహ్మద్‌ సిరాజ్‌ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరును వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహ్మద్‌ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ని పెట్టాడు.

ఈ సందర్భంగా తన మనసులోని భావాలను వ్యక్తం చేశాడు. ఆర్‌సీబీ తన హృదయానికి దగ్గరైందని.. ఈ ప్రయాణం ఓ అసాధారణ అనుభవం కంటే తక్కువ కాదని పేర్కొన్నాడు. తాను తొలిసారిగా ఆర్‌సీబీ జెర్సీని ధరించిన రోజు.. తాము ఇంత దగ్గరవుతామని ఎప్పుడూ అనుకోలేదని.. ఆర్సీబీ జెర్సీ ధరించి వేసిన మొదటి బంతి, తీసిన ప్రతి వికెట్‌, ఆడిన ప్రతి మ్యాచ్‌, మీతో గడిపిన ప్రతిక్షణం, ఈ ప్రయాణం అసాధారణ అనుభవం కంటే తక్కువ కాదు.. ఇందులో హెచ్చుతగ్గులున్నాయి కానీ.. ఒక విషయం స్థిరంగా ఉందని.. అది తిరుగులేని మద్దతు అంటూ స్పందించాడు.

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు సిరాజ్‌ను ఆర్‌సీబీ రిలీజ్‌ చేసింది. ఆర్‌సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్‌ చేసుకొని.. మిగతా వారందరినీ రిలీజ్‌ చేసింది. ఇందులో విరాట్‌ కోహ్లీని రూ.21కోట్లకు, రజత్‌ పటీదార్‌ రూ.11కోట్లు, యశ్‌ దయాల్‌ రూ.4కోట్లకు అట్టిపెట్టుకున్నది. సిరాజ్‌ రూ.2కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలానికి రాగా.. గుజరాత్‌ టైటాన్స్‌ రూ.12.25కోట్ల కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ తరఫున సిరాజ్‌ 87 మ్యాచులు ఆడి.. 83 వికెట్లు తీశాడు. మొదట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఐపీఎల్‌ కెరీర్‌ను ప్రారంభించిన సిరాజ్‌.. 2018లో ఆర్‌సీబీ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.

2024-11-27T03:11:02Z